సంచలనం: శాప్ వేధిస్తోంది...ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ,నిరాహార దీక్ష
అమరావతి:ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) తనను వేధిస్తోందని ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ సంచలన ఆరోపణలు చేసింది.
అర్జున అవార్డు సాధించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన ప్రోత్సాహకంలో అక్రమంగా శాప్ అధికారులు కోత విధించారని ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
క్రీడాకారిణిగా తాను కనబర్చిన ప్రతిభను మెచ్చుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోటి రూపాయలు ప్రోత్సాహకం ఇవ్వగా అందులో రూ.15 లక్షలను కోచ్కు ఇచ్చేలా శాఫ్ అధికారులు జీవో జారీ చేయడం దారుణం అని జ్యోతి సురేఖ చెప్పారు. అధికారులు అందరూ కుమ్మక్కయి కోచ్ చెరుకూరి సత్యనారాయణకు ఆ మొత్తాన్ని కేటాయించారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అసలు చెరుకూరి సత్యనారాయణ తన కోచే కాదన్నారు.

ఈ విషయమై వివరణ ఇచ్చిన జ్యోతి సురేఖ...తాను 2013 లోనే చెరుకూరి సత్యనారాయణకు చెందిన ఓల్గా ఆర్చరీ అకాడమీ నుంచి బయటకు వచ్చేశానని చెప్పారు. ఇప్పుడు చెరుకూరి సత్యనారాయణ తనకు కోచ్ కాదని...ఆయన కేవలం వార్డెన్ మాత్రమేనని ఆమె వెల్లడించారు. అసలు ఈ విషయమై కనీసం తనను అడగకుండా,సంప్రదించకుండా సత్యనారాయణ తన కోచ్ అని శాప్ అధికారులు ఎలా డిసైడ్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. క్రీడాకారులను సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నా శాప్ మాత్రం వారి పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అందుకు ఇదొక ఉదాహరణ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో క్రీడాకారులకు సీఎం ప్రకటించిన ప్రోత్సాహకం మొత్తాన్ని యథాతథంగా అందిచేవారని...అయితే ప్రస్తుతం శాప్లోని కొందరు ఉన్నతాధికారులు లాలూచీ పడుతూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు ఒక క్రీడాకారిణిగా తనకు శాప్ నుంచి కనీస ప్రోత్సాహం కరువవగా చివరకు ఈ విధంగా ఏకంగా వేధింపులకు సైతం పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తే భవిష్యత్తులో రాష్ట్రం తరపున ఎలా ఆడాలని ఆమె ప్రశ్నించారు. సీఎం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో సోమవారం నిరాహార దీక్షకు దిగుతామని జ్యోతి సురేఖ సహా ఆమె కుటుంబం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications