శ్రీవారి సేవకు 16 ఏళ్లుగా ఎదురుచూపులు: భక్తుడికి రూ. 45 లక్షలు ఇవ్వాలని టీటీడీకి కోర్టు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి వ్యతిరేకంగా దాఖలైన కేసులో ఓ భక్తుకుడికి రూ. 45 లక్షల పరిహారం చెల్లించాలని సేలం వినియోగదారుల కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తమిళనాడులోని సేలం జిల్లా ఆగళాపురానికి చెందిన హరి భాస్కర్ 2006 జూన్ 27న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మేల్ చాట్ వస్త్రం సేవలో పాల్గొనేందుకు తనతోపాటు ఇద్దరి పేర్లతో రూ. 12,250 చెల్లించి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారు.
భక్తుడి కోరిక సాధ్యం కాదంటూ నిరాకరించిన టీటీడీ
ఈ క్రమంలో 2020 జులై 10న ఆ సేవలో పాల్గొనేందుకు అనుమతి వచ్చింది. అయితే, 2020లో కరోనా వైరస్ కారణంగా ఆ సేవను నిషేధించారు. దానికి బదులుగా బ్రేక్ దర్శనం చేసుకునేందుకు టీటీడీ అధికారులు అవకాశం కల్పించారు. అయితే, తాను మేల్ చాట్ వస్ర్తం సేవలోనే పాల్గొంటానని హరిభాస్కర్ కోరగా అందుకు టీటీడీ నిరాకరించింది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు.. ఆగస్టు 18న తీర్పు వెల్లడించింది. అయితే, ఈ తీర్పు తాజాగగా వెలుగులోకి వచ్చింది.
భక్తుడికి రూ. 45 లక్షలు ఇవ్వాలంటూ టీటీడీకి కోర్టు ఆదేశం
ఏడాదిలోగా పిటిషన్దారుడికి మేల్ చాట్ వస్త్రం సేవలో పాల్గడానికి అవకాశం కల్పించాలని, లేని పక్షంలో సేవా లోపం కింద పరిగణించి రూ. 45 లక్షల పరిహారం చెల్లించాలని సేలం వినియోగదారుల కోర్టు ఆదేశించింది. అంతేగాక, సేవ కోసం చెల్లించిన రూ. 12,250ను రెండు నెలల్లో తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది.
టీటీడీ అవకాశాన్ని వినియోగించుకున్న 95 శాతం భక్తులు
కాగా, సేలం వినియోగదారుల కోర్టు తీర్పుపై టీటీడీ అప్పీల్కు వెళ్ళనున్నట్లు సమాచారం. అయితే, ఆర్జిత సేవా టికెట్లు ఉండి స్వామివారి దర్శనం కల్పించలేదని ఇప్పటికే కోర్టును మరో 10 మంది భక్తులు ఆశ్రయించారు. కరోనా కారణంగా 2020, మార్చి 20 నుంచి 2022, మార్చి వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే.
అప్పట్లో అడ్వాన్స్ రిజర్వేషన్ లో మొత్తం 17,946 ఆర్జిత సేవా టికెట్లను భక్తులు పొందారు. టికెట్లు కలిగిన భక్తులుకు సేవలను రద్దు చేసిన కారణంగా నగదు తిరిగి ఇచ్చేయడం లేదా వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. టీటీడీ ఇచ్చిన అవకాశాన్ని 95 శాతం మంది భక్తులు వినియోగించుకున్నారు. మరికొందరు భక్తులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఇందులో టీటీడీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. సేలం కోర్టులో మాత్రం వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు వచ్చింది.