AP Panchayat Elections 2021: నేడే తొలిదశ పోలింగ్...విజయనగరం మినహా 12 జిల్లాలోనూ..!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే చాలా కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరింది. పోలింగ్ విధులు నిర్వహించేందుకు.... సిబ్బంది కేంద్రాలకు చేరుకుంటున్నారు.
తొలి విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా రోగులు చివరి గంటలో ఓటు వేసేందుకు రావాలని సూచించారు. పోలింగ్ జరిగే తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. అంతేగాక, పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటా కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే, నోటాకు వచ్చే ఓట్లను లెక్కించబోమన్నారు.
విజయనగరం జిల్లాను మినహాయించి తక్కిన 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, అనకాపల్లి, కాకినాడ, పెద్దాపురం, నర్సాపురం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, కావలి, నంద్యాల, కర్నూలు, కదిరి, జమ్మలమడుగు, కడప, రాజంపేట, చిత్తూరు రెవెన్యూ డివిజన్లలోని.. మొత్తం 3,249 పంచాయతీ సర్పంచ్, 32,502 వార్డులకు పోలింగ్ జరగాల్సి ఉండగా.. 525 సర్పంచ్, 12,185 వార్డులు ఏక గ్రీవమయ్యాయి.
ఈ క్రమంలో 2,723 సర్పంచ్, 20,157 వేలకు పైగా వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల పోలింగ్ కోసం.. 29,732 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో తొలిసారి నోటా ప్రవేశపెట్టారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్టభద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటికే జిల్లాల్లో పర్యటించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.