మంత్రి సిద్ధా రాఘవరావుపై అరెస్ట్ వారెంట్ జారీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావుపై ఒంగోలు న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయన, మరికొందరు తెలుగుదేశం పార్టీ నేతలు ఓ క్రిమినల్ కేసుకు సంబంధించిన వాయిదాలకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఏపి ముఖ్యమంత్రితో డిజిపి భేటీ
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో రాష్ట్ర డిజిపి రాముడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
2016 నుంచి జిఎస్టి అమలు: యనమల
2016 నుంచి జిఎస్టి అమలు చేయనున్నట్లు ఏపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఫిబ్రవరిలోగా కేంద్రం నుంచి సిఎస్టి బకాయిలు విడుదలవుతాయన్నారు. 2010-11 సంవత్సరానికి గానూ రూ. 700 కోట్ల బకాయిలు విడుదల కానున్నట్లు ఆయన చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రానికి రూ. 13వేల కోట్ల మేరకు బకాయిలు ఉన్నట్లు చెప్పారు. వీటిలో ఏపి వాటా రూ. 7వేల కోట్లు ఉంటాయని మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు.
తుళ్ళూరు ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటన
పంటపొలాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన నేపథ్యంలో తుళ్లూరు ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల బృందం మంగళవారం పర్యటించింది. తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని ఆరు గ్రామాల్లో 13 చోట్ల పంటపొలాలు, తోటలు, షెడ్లు, వెదురుబొంగులు, డ్రిప్ పరికరాలను గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి తగలబెట్టిన విషయం తెలిసిందే.
లింగాయపాలెం, ఉద్దండరాజుపాలెం, వెంకటపాలెం గ్రామాలలో ఈ బృందం పర్యటించింది. బాధిత రైతులను పరామర్శించింది. అండగా ఉంటామని రైతులకు హామీ ఇచ్చింది. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఒత్తిడి చేస్తామని అన్నారు. పర్యటించిన బృందంలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గొట్టిపాటి రవి, ఉప్పులేటి కల్పన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నాగిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మర్రి రాజశేఖర్, క్రిస్టియానా తదితరులు ఉన్నారు.