హోదాపై జైట్లీ కొత్త ట్విస్ట్, పవన్కు క్లారిటీ వచ్చిందా: ఈ ప్రశ్నలకు బదులేది?
న్యూఢిల్లీ/విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. మొన్న కేంద్రమంత్రి హెచ్పి చౌదరి, నిన్న జయంత్ సిన్హా, ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా పైన తేల్చి చెప్పేశారు. జైట్లీ హోదా విషయంలో కొత్త వాదన తెర పైకి తీసుకు రావడం గమనార్హం.
జైట్లీ గురువారం లోకసభలో ప్రత్యేక హోదా పైన మాట్లాడారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటిని ఏపీకి నెరవేరుస్తామని, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. విభజన చట్టంలోని హామీలనే అని చెప్పడం ద్వారా.. హోదా ఇవ్వమని కూడా తేల్చేశారు.
అంతేకాదు, ప్రత్యేక హోదా డిమాండ్ నేపథ్యంలో ఆయన మరో కొత్త వాదనను వినిపించారు. అసలు రాష్ట్రాన్ని విభజించిందే తమ ప్రభుత్వం కాదని ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. తద్వారా ప్రత్యేక హోదా విషయంలో తమను తప్పుపట్టలేరని జైట్లీ అభిప్రాయపడ్డట్లుగా భావించవచ్చునని అంటున్నారు. తాము పోలవరం ప్రాజెక్టు పైన, చట్టంలో ఇచ్చిన ఇతర హామీల పైన పూర్తి కమిట్మెంటుతో ఉన్నామని చెప్పారు.
మరీ వీటి మాటేమిటి?
విభజన చట్టంలోని హామీలను తాము అమలుపరుస్తామని చెబుతున్న మోడీ ప్రభుత్వంపై ఏపీ ప్రజలు, విపక్షాలు, అధికార తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. అయితే, మీరు స్వయంగా ఇచ్చిన హామీల మాట ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ప్రధాని మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
విభజన సమయంలో ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు.. పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారని, దాని గురించి వెంకయ్య ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు.
విభజన నేపథ్యంలో తమకు ఏపీ సమస్యలు తెలుసునని, పూర్తిగా ఆదుకుంటామని ఇన్నాళ్లు బిజెపి నేతలు చెప్పారని గుర్తు చేస్తున్నారు.
ప్రత్యేక హోదా తప్పకుండా సాధిస్తామని ఏపీ బీజేపీ నేతలు ఇప్పటిదాకా చెప్పుకుంటూ వస్తున్నారని, ఇప్పుడు ఏం చెబుతారని అడుగుతున్నారు.
స్వయంగా ఢిల్లీ పెద్దలు కూడా మొన్నటి వరకు హోదా ఆలస్యంగానైనా వస్తుందని నమ్మబలికారని గుర్తు చేస్తున్నారు.
తాము వద్దంటే విభజించి కాంగ్రెస్ పార్టీ ఏపీని ముంచిందని, ఇప్పుడు బిజెపి నమ్మించి నట్టేట ముంచిందని మండిపడుతున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బిజెపిని నమ్మారని చాలామంది చెబుతున్నారు. ఆయన కూడా బిజెపి పైన నమ్మకంతో ఇప్పటిదాకా సాఫ్టుగా మాట్లాడుతున్నారని గుర్తు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్కు క్లారిటీ వచ్చిందా?
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజెపి పైన ఇప్పటిదాకా సాఫ్టుగానే కనిపించారు. ఏపీ రాజధానికి భూముల విషయంలో పవన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన సీరియస్గా స్పందించారు. హోదా విషయంలో మాత్రం బిజెపి పైన ఒకింత మృదువుగా కనిపించారు.
పవన్ కళ్యాణ్ రెండుమూడుసార్లు ప్రత్యేక హోదా పైన స్పందించారు. కానీ చంద్రబాబులాగే.. బీజేపీపై నమ్మకంతో మృదువుగా మాట్లాడారు. ఇటీవల కేంద్రమంత్రి చౌదరి ప్రకటన అనంతరం మాత్రం.. కాంగ్రెస్ పార్టీలో మోసం చేయవద్దని హెచ్చరించారు.
కేంద్రమంత్రులు వరుసగా ప్రత్యేక హోదా రాదని తేల్చేస్తున్నారు. మొన్న హెచ్పి చౌదరి, నిన్న జయంత్ సిన్హా, నేడు అరుణ్ జైట్లీ తేల్చేశారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ క్లారిటీ వచ్చి ఉంటుందని, ఇకనైనా స్పందించాలని చాలామంది కోరుతున్నారు.