అపోలో వద్ద 'అమ్మ' సరుకులకు భలే గిరాకీ, జయలలితపై జగన్ ట్వీట్
చెన్నై/అమరావతి: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో అపోలో పరిసరాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికూడుతున్నారు. అమ్మ కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.
అమ్మ మద్దతుదారుల వల్ల గత కొద్ది రోజులుగా అక్కడ హడావుడి కనిపిస్తోంది. అంతేకాదు, అపోలో వద్ద భారీ అమ్మ అభిమానుల నేపథ్యంలో దగ్గరలోని దుకాణాలో అమ్మ వస్తువులు బాగా అమ్ముడుపోతున్నాయి. పోస్టుకార్డులు, పెన్నులు, ఎన్వోలాప్స్, పోస్టర్స్ తదితరాలు అమ్ముడుపోతున్నాయి. వీటి అమ్మకం రోజుకు రూ.2వేల వరకు ఉంటోంది.
అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు వస్తున్నారు. వీరు పలు వస్తువులు కొంటున్నారు. ముఖ్యంగా అమ్మ హెడ్ బ్యాండ్స్, వాలెట్, చైన్లు పెద్ద ఎత్తున అమ్ముడుపోతున్నాయి. ఒక్కో వస్తువు విలువ రూ.20 నుంచి రూ.150 వరకు ఉంటోంది. అమ్మ కీ చైన్ రూ.30 దాకా ఉంది. మరోవైపు, అభిమానులు ఆసుపత్రి వద్ద పూజలు చేస్తున్నారు. కొందరు అయితే నాలుగైదు రోజులు అయినా అక్కడి నుంచి కదలడం లేదు.
జయ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: జగన్
జయలలిత త్వరగా కోలుకోవాలని వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ట్వీట్ చేశారు. 'పురచ్చితలైవి' జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. జయలలిత వీలైనంత త్వరగా మళ్లీ ప్రజాసేవలోకి రావాలని దేవుడిని కోరుతున్నాను' అని పేర్కొన్నారు.