హైదరాబాద్పై రాష్ట్రపతితో అసద్: ప్యాకేజీ మాటపై బొత్స
న్యూఢిల్లీ/ విజయనగరం/ గుంటూరు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జివోఎం కసర్తతు పూర్తవుతున్న నేపథ్యంలో మజ్లీస్ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిశారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయవద్దని ఆయన వారిని కోరారు. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాదును తెలంగాణలో భాగం చేయాలని కూడా ఆయన కోరుతున్నారు.
కాగా, రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రకు ప్యాకేజీ అనే పదాన్ని వాడడం సరి కాదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్యాకేజీ అనేది వ్యాపారంలో వాడే పదమి, ఈ పదాన్ని సీమాంధ్ర విషయంలో మీడియా వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు.

తాము పోరాటం చేస్తోంది హక్కుల కోసమే తప్ప ప్యాకేజీల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించి కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) విభజన ప్రక్రియను ఆపాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. విభజన నేపథ్యంలో జివోఎం పేర్కొన్న అంశాలపై అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రజల మనోభావాలను గతంలోనే మెయిల్ చేసినట్లు ఆయన తెలిపారు.
విభజన విషయంలో ప్రజలు కాంగ్రెసుపై కోపంగా ఉన్నారని కేంద్ర మంత్రి జెడి శీలం అన్నారు. అయితే, ఎప్పటికైనా కాంగ్రెసు పార్టీ మాత్రమే ప్రజలకు న్యాయం చేస్తుందని ఆయన అన్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications