జగన్ బాగుండాలి, కానీ..: అశోక్ గజపతిరాజు విమర్శలు, ‘ఎన్టీఆర్ అంటే గౌరవమే’
హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బాగుండాలంటూనే తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు టీడీపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు. ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో పలు ఆసక్తికర అంశాలను ఆయన వెల్లడించారు.

జగన్ బాగుండాలి..
రాజకీయాల్లో చంద్రబాబు, వైయస్ రాజశేఖరరెడ్డి, తాను సమకాలికులమని అశోక్ గజపతిరాజు తెలిపారు. తన కొలీగ్ కుమారుడిగా వైసీపీ అధినేత జగన్ బాగుండాలనే తాను కోరుకుంటానని ఆయన తెలిపారు.

జగన్ దారి మంచిది కాదు..
అయితే, జగన్ వెళ్తున్న దారి మాత్రం దేశానికి మంచిది కాదని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. ఆయన ఎంచుకున్న వైఖరి రాజకీయాలకే కాదు వ్యక్తిగతంగా ఆయనకు కూడా మంచి చేయదని అన్నారు.

టీడీపీదే విజయం
ప్రస్తుతానికి ఏపీ ప్రజల్లో సంతృప్త స్థాయి చాలా ఎక్కువగా ఉందని... ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయమని అశోక్ జోస్యం చెప్పారు. రాష్ట్రానికి విభజన సమస్యలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అడిగింది, ఇస్తామని చెప్పింది జాతీయ పార్టీలేనని... ఇవ్వాల్సిన బాధ్యత వాటిపైనే ఉందని అన్నారు. అభివృద్ధిలో ఏపీ అత్యుత్తమ స్థితిలో ఉందని, దాన్ని కొనసాగిస్తూనే, హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతామని చెప్పారు.

ఎన్టీఆర్ అంటే ఎప్పటికీ గౌరవమే..
వ్యక్తిగతంగా దివంగత ఎన్టీఆర్ అత్యున్నతమైన వ్యక్తి అని, ఆయన వల్లే తెలుగు జాతికి గుర్తింపు వచ్చిందని అశోక్ తెలిపారు. ఆ రోజున కొన్ని ఇబ్బందులు వచ్చాయని, వాటిని సరిదిద్దేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వలేదని, అందుకే తాము బయటకు వచ్చామని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తమకు ఎప్పటికీ గౌరవమేనని అశోక్ గజపతి రాజు చెప్పారు.












Click it and Unblock the Notifications