అసెంబ్లీ: అదే సీన్తో వాయిదా, ఎవరి పట్టు వారిదే
హైదరాబాద్: శాసనసభలో శనివారం నాడు కూడా ఏ విధమైన మార్పు లేదు. సభ సమావేశమైన కొద్ది సేపటికే శనివారం వాయిదా పడింది. సభా కార్యక్రమాలు స్తంభించడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ గంట పాటు సభన వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు, ఇతర పార్టీల సీమాంధ్ర శాసనసభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. తెలంగాణ శానససభ్యులు జై తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. దీంతో సభను స్పీకర్ గంట పాటు వాయిదా వేశారు.
కాగా, స్పీకర్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష ఉప నేత హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. స్పీకర్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగకపోతే రాష్ట్రపతిని ఆవమానించినట్లేనని ఆయన అన్నారు. విభజనను అడ్డుకుంటామని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన ప్రసంగాన్ని రాష్ట్రపతికి, కేంద్రానికి పంపుతామని ఆయన అన్నారు.
సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నవారిని సస్పెండ్ చేసి చర్చను సాగించాలని ఆయన కోరారు. సభ జరగకపోతే స్పీకర్ ఛాంబర్ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. సోమవారంవరకు కూడా సభ జరగకపోతే తమ వాదనలను రాతపూర్వకంగా సమర్పిస్తామని హరీష్ రావు చెప్పారు.
శాసనసభలో సీమాంధ్ర శాసనసభ్యులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని బిజెపి శాసనసభ్యుడు యెండల లక్ష్మినారాయణ విమర్శించారు. బిల్లుపై చర్చకు సీమాంధ్ర శాసనసభ్యులు సహకరించాలని ఆయన కోరారు.
వచ్చే ఎన్నికలను రెఫరెండంగా తీసుకుందామని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాము తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు వ్యతిరేకం కాదని, అయితే ముందు సమైక్య తీర్మానం చేయాలని ఆయన అన్నారు.
శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా విభజన విషయంలో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శానససభ్యుడు ధూళిపాల్ల నరేంద్ర చౌదరి విమర్శించారు. సమాచారం అందించకుండా బిల్లుపై ఎలా చర్చ చేస్తామని ఆయన అడిగారు.
సోమవారానికి వాయిదా
రెండో సారి సమావేశమైన తర్వాత కూడా శాసనసభ కార్యకలాపాల్లో మార్పు రాలేదు. సభ్యులు గందరగోళం సృష్టించడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ కొద్దిసేపటికే మరోసారి వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత సభ్యులు ఆందోళనకు దిగడంతో సభను డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్క సోమవారానికి వాయిదా వేశారు. బిల్లును చించి కొంత మంది సభ్యులు స్పీకర్ పోడియంపైకి విసిరారు. తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు సమైక్య నినాదాలు చేశారు.
శాసనసమండలిలోనూ అదే పరిస్థితి. మండలి కూడా సోమవారానికి వాయిదా పడింది. అయితే, సోమవారం నుంచి తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనమండలిలో చర్చించేందుకు అన్ని పార్టీల సభ్యులూ అంగీకరించారు.