రెండూ వేర్వేరుగా జరగడంవల్ల ఎంతో ఉపయోగముంది!
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అసెంబ్లీకి, లోక్ సభకు ఒకేసారి జరుగుతుంటాయి. అందరూ ఇదే సరైన షెడ్యూల్ కాబోలు అనుకుంటుంటారు. కానీ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003 అక్టోబరు 1న అలిపిరి దగ్గర నక్సలైట్లు ఆయనపై క్లైమోర్ మైన్స్ తో దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చంద్రబాబు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఆ సమయానికి ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాది సమయముంది. కానీ నక్సలైట్ల దాడివల్ల ప్రజల్లో సానుభూతి వస్తుందనే నమ్మకంతో 2004 ఏప్రిల్ లో ఎన్నికలకు వెళ్లి అసెంబ్లీ, లోక్ సభ.. రెండింటిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు.
లోక్ సభకు, అసెంబ్లీకి ఒకేసారి..
అప్పటి నుంచి ఏపీలో ఎన్నికలు లోక్ సభకు, అసెంబ్లీకి ఒకేసారి జరుగుతున్నాయి. దీనివల్ల అధికార పార్టీకి అవకాశం తక్కువగా లభిస్తోంది. రెండు ఆప్షన్స్ ఉండటంతో ప్రజలు అసెంబ్లీకి ఒక పార్టీకి, లోక్ సభకు మరోపార్టీకి ఓటు వేస్తున్నారు. అలా కాకుండా వేర్వేరుగా కొంత గ్యాప్ తో ఎన్నికలు నిర్వహిస్తే అధికార పార్టీకి విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వ్యక్తం చేస్తున్నారు.
వేర్వేరుగా ఉంటాయా?
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ లోక్ సభ ఎన్నికలతోపాటు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం సరికాదని భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కూడా అదే ఉద్దేశంతో ఉండటంతో ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతాయని భావిస్తున్నారు. అందుకే ముందస్తు ఎన్నికలంటున్నారని, అదే మంచి పద్ధతని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
పలు రాష్ట్రాల్లో తరుచుగా జరుగుతున్న ఎన్నికలవల్ల దేశవ్యాప్తంగా అమలుచేసే అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ ఉంది. అందుకే జమిలి ఎన్నికల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని రాష్ట్రాల అభిప్రాయాలను కోరాలనుకుంటోంది. కానీ ఆచరణలో ఇది సాధ్యం కాకపోవడంతోపాటు ఏ రాష్ట్రం నుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తమవడంలేదు.
ముందస్తుకే మొగ్గు చూపుతోందా?
జమిలి ఎన్నికలంటూ ప్రచారం జరుగుతున్న ప్రతిసారీ సాధారణంగానే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోతున్నాయి. దీంతో తాత్కాలికంగా జమిలి ప్రతిపాదనను ఎన్డీయే సర్కార్ పక్కన పెట్టింది. ప్రజలు ఆదరిస్తే ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే కాకుండా లోక్ సభ ఎన్నికలను సావధానంగా ఎదుర్కోవడానికి వీలవుతుందనే అభిప్రాయంలో పార్టీలన్నీ ఉన్నాయి.
దీంతో ఈసారి ఏపీ అసెంబ్లీకి, లోక్ సభకు రెండు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరగబోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు కూడా ముందస్తుకే మొగ్గుచూపుతుండటంతో ప్రజలకు ఒకసారి ఒకే ఆప్షన్ దక్కబోతోంది. వారు దీన్ని ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి మరి.