ప్రయత్నాలు చేశాం, ఆ పార్టీలు సహకరించాలి: రఘువీరా
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చకు శాసనసభ సభ్యులు సహకరించాలని రాష్ట్రమంత్రి రఘువీరా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... శాసనసభలో ముసాయిదా బిల్లుపై సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. ఇరు ప్రాంతాల నాయకులు కూడా బిల్లుపై చర్చకు సహకరించాలని కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సమైక్యానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాలు గురించి సభ ముందుకు తీసుకురావాలని ఆయన కోరారు. సభలో బిల్లుపై చర్చించిన తర్వాత న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణుల సహాయం కోరాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అసెంబ్లీలో బిల్లుపై అభిప్రాయాలు తెలిపిన తర్వాత బిల్లు పార్లమెంటుకు వెళుతుందని, అక్కడ కూడా అనేక పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయని చెప్పారు.
శాసనభలో బిల్లుపై పూర్తి చర్చించి, సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలని సభ్యులను కోరారు. సాగునీరు, పెన్షనర్లు, ఉద్యోగస్తులు, రెవెన్యూ పంపకం, హైదరాబాద్, వీటన్నటికంటే ముఖ్యంగా రాజ్యాంగ చిక్కులు, అన్ని అంశాలపై సభలో చర్చ జరగాలని రఘువీరారెడ్డి అన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా 159 మంది సభ్యులు తీర్మానం చేస్తే, దీనిపై పార్లమెంటు పునరాలోచించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
గత నాలుగు రోజులుగా సభను సజావుగా జరగడానికి అనేక ప్రయత్నాలు చేశామని ఆయన అన్నారు. చర్చకు సహకరించాలని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల సభ్యులను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా చర్చకు సహకరించాలని బిఏసి సమావేశాలు జరుపుతున్నారని చెప్పారు. 4, 5 మాసాలుగా రాష్ట్రంలోని నలుమూలాల్లోనూ ఆయా పార్టీల నేతలు పర్యటిస్తూ సభకు తీర్మానం వస్తే గట్టిగా వ్యతిరేకిస్తామని చెప్పి, ఇప్పుడు వారే చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
బిల్లుపై చర్చ జరగకుండా పంపిస్తే సభ అర్ధాంగీకారం తెలిపినట్లవుతుందని రఘువీరారెడ్డి చెప్పారు. బిల్లులోని అంశాలపై చర్చించకపోతే మన అభిప్రాయాలకు విలువ ఉండదని ఆయన చెప్పారు. అందుకే సభ్యులందర్నీ చర్చకు సహకరించాలని కోరుతున్నామని చెప్పారు. సమైక్యాంధ్ర కోరుకునే వారు, తెలంగాణ కోరుకునే వారు బిల్లుపై తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు. తాము అభిప్రాయం తెలిపే వాళ్లమే కానీ, నిర్ణయం తీసుకునే వాళ్లం కాదని తెలిపారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ
రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉండవల్లి అరుణ్ కుమార్, వట్టి వసంత కుమార్, గాదె వెంకట్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.