ప్రభుత్వం వంతపాడుతున్నట్లే: క్వారీ ప్రమాదంపై పవన్, కరుణానిధి ఆరోగ్యంపై..
కర్నూలు: జిల్లాలోని ఆలూరు మండలం హత్తిబెళగల్ వద్ద శుక్రవారం క్వారీలో ఘోర ప్రమాదం జరిగి, పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం అక్కడకు వెళ్లి పరామర్శించనున్నారు. ఆయన శనివారం పొలిటికల్ అపైర్స్ కమిటీతో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై చర్చించారు.
ఈ సమావేశంలో పవన్తో పాటు కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం, కమిటీ సభ్యులు తోట చంద్రశేఖర్, అర్హమ్ యూసుఫ్, మారిశెట్టి రాఘవయ్య, రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హత్తిబెళగల్ మృతులకు కమిటీ సంతాపం తెలిపింది. క్వారీ ప్రమాదంపై జనసేన తీవ్ర సంతాపం వ్యక్తం చేసిందని చెబుతూ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వం అక్రమ మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకోపోవడం, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే హత్తిబెళగల్ క్వారీ ప్రమాదాల వంటివి చోటు చేసుకుంటున్నాయని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. క్వారీ వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపింది. భద్రతా ప్రమాణాల వ్యవహారాన్ని సంబంధిత శాఖలు పట్టించుకోవడం లేదని సమావేశం అభిప్రాయపడింది.

ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి పొట్ట చేతబట్టుకుని వచ్చిన వలసకూలీలు మరణించడం బాధాకరమని అధినేత పవన్ విచారం వ్యక్తం చేశారు. క్వారీ ఉన్న గ్రామంతో పాటు పరిసర గ్రామాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదంటే ప్రభుత్వమే అక్రమ పద్ధతుల్లో తవ్వకాలకు వంతపాడుతోందని అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు.
సోమవారం హత్తిబెళగల్ వెళ్లి పరిస్థితులు పరిశీలించాలని పవన్ నిర్ణయించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వారిని, మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. కర్నూలు పర్యటన కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన రెండు రోజులు ఆలస్యమవుతుందని పేర్కొంది.
ఇదిలా ఉండగా, క్వారీ దుర్ఘటనకు టీడీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణలు డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 20లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. క్వారీ నిర్వహణ తీరుపై స్థానికులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.
కరుణానిధి ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్
ద్రవిడ ఉద్యమ యోధుడు, డీఎంకే అధినేత కరుణానిది సంపూర్ణంగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కరుణ అనారోగ్యంతో కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయ తెలిసిందేనని, తమిళనాడులో జరిగిన అనేక ఉద్యమాలకు ప్రజల పక్షాన నిలిచిన నేత ఆయన అన్నారు.
తాడిత, పీడిత ప్రజల పక్షపాతి కరుణ అన్నారు. వెనుకబడిన వారి అభివృద్ధికి నిరంతరం పాటుపడ్డారని చెప్పారు. రచయితగా కలైంగర్గా కీర్తించబడ్డారని, ఈ విషయాలను నేను చదివి తెలుసుకున్నవి కాదని, నేను కొన్నాళ్లు చెన్నైలో ఉండటం వల్ల ఆయన గురించి ప్రత్యక్షంగా చూసి అవగాహన చేసుకున్నవని పవన్ పేర్కొన్నారు.
రచయితగా, రాజకీయ దురంధరుడిగా తమిళనాడుతో పాటు ఆయన మన దేశానికి చేసిన సేవలకు ఆయనకు మనం ఎంతో రుణపడి ఉన్నామని, కరుణ వంటి యోధులు మన మధ్య ఉంటే చాలు వారి స్ఫూర్తి నలుదిశలా వ్యాప్తిస్తూనే ఉంటుందని అన్నారు. ఇలాంటి మహానుభావులు చిరంతనగా మన జన్మభూమిపై ఉండాలని, ఆ భగంవతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని పవన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications