భేటీలో మోడీని కడిగేయనున్న చంద్రబాబు, 'ఇక ఏ ముఖ్యమంత్రికైనా ఇలాగే మద్దతు'
అమరావతి/న్యూఢిల్లీ: నీతి అయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. మిగతా బీజేపీయేతర ముఖ్యమంత్రులు కూడా పలు అంశాలపై నిలదీయనున్నారు. అవసరమైతే చంద్రబాబు సహా బీజేపీయేతర సీఎంలు ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరించే యోచనలో ఉన్నారు.
ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలు అమలు చేయడంలో ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశం వేదికగా గొంతెత్తాలని చంద్రబాబు నిర్ణయించారు. కేంద్రం విధానాల వల్ల దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్య ధోరణి, కేంద్ర, రాష్ట్ర సంబంధాలను పునఃసమీక్షించుకోవలసిన అవసరం తదితర అంశాలను ప్రస్తావించననున్నారు.
శనివారం మరోసారి భేటీ
నీతి అయోగ్లో చర్చించాల్సిన అంశాలపై నాలుగు రోజుల పాటు అధికారులు, ఎంపీలు, పార్టీ వ్యూహ కమిటీ సభ్యులతో చంద్రబాబు చర్చించారు. శనివారం ఢిల్లీ బయలుదేరే ముందు మరోసారి అధికారులు, వ్యూహ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ప్రస్తావించాల్సిన అంశాలకు తుది రూపునిచ్చారు. జాతీయ ప్రాధాన్యంగల అంశాలు, విభజన చట్టంలోని అంశాలు-హామీల అమలు, వ్యవసాయరంగం-రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోగ్య రంగానికి సంబంధించిన పథకాల అమలు, ఇతర అంశాలన్నీ కలిపి ఒక విభాగం చేశారు. సమావేశంలో మాట్లాడేందుకు లభించే సమయాన్ని బట్టి ఎంపిక చేసిన అంశాలను ప్రాధాన్య క్రమంలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు.
నలుగురు గంటసేపు భేటీ అయ్యారు
నేడు (ఆదివారం) జరగనున్న నీతి ఆయోగ్ సమావేశం నిమిత్తం ఢిల్లీకి వచ్చిన నలుగురు సీఎంలు చంద్రబాబు, కుమారస్వామి, మమతా బెనర్జీ, పినరాయి విజయన్ శనివారం సుమారు గంటసేపు సమావేశమయ్యారు. వీరంతా వేర్వేరుగా ఏపీ భవన్కు చేరుకున్నారు. పరస్పర అవసరాల నిమిత్తం కలిసి చర్చించుకొని సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి కోసం ధర్నా చేస్తున్న కేజ్రీవాల్కు మద్దతు తెలపాలని నిర్ణయించారు. గతంలో ప్రధాని నివాసం ముట్టడి సమయంలో ఇటీవల అరెస్టయిన టీడీపీ ఎంపీలకు కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు కూడా.
వారికి వివరించిన చంద్రబాబు
ఈ నేపథ్యంలో చంద్రబాబు చొరవ తీసుకొని ఐక్యంగా ఉండాల్సిన అవసరం గురించి మమతా బెనర్జీ, కుమారస్వామి, పినరయి విజయన్లకు వివరించారు. కేజ్రీవాల్కు మద్దతివ్వడం ద్వారా రాష్ట్రాల ఐక్యతను కేంద్రానికి బలంగా వినిపించొచ్చని చంద్రబాబు సూచించారు. సమష్టిగా పోరాడితేనే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర అవసరాలకు తగిన నిధులు సాధించుకోవచ్చన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులతో చంద్రబాబు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని చెప్పారు.
కేజ్రీవాల్ ధర్నా
ఢిల్లీ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కోసం కేజ్రీవాల్ చేస్తున్న ధర్నా గురించి ఆదివారం నీతి ఆయోగ్లో సమయం చూసుకొని ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లాలని నలుగురు సీఎంలు నిర్ణయించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా విపక్ష ఐక్య కూటమిని ఏర్పాటుచేయాలని భాజపాయేతర పార్టీలు ప్రయత్నిస్తున్న తరుణంలో వీరి భేటీ జరగడం విశేషం. రాజధాని ఢిల్లీలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పనిచేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. రాజకీయాలు వేరనీ, కేంద్రం- రాష్ట్రం కలిసి పనిచేయాలన్నారు. కేజ్రీవాల్కు మద్దతు తెలపడానికి మేమంతా వచ్చామని, ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగించడానికి లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రం సహకరించాలని, మేం నలుగురు ముఖ్యమంత్రులు కేజ్రీవాల్ను కలవడానికి అనుమతి కోరితే ఎల్జీ నిరాకరించారని, తక్షణమే సమస్య పరిష్కరించాలని మేం డిమాండ్ చేస్తున్నామని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, రాష్ట్ర పాలన సజావుగా సాగకుండా చేయడం శోచనీయమని, ధర్నా విరమించాలని మేం కేజ్రీవాల్ను కోరబోమని చంద్రబాబు చెప్పారు.
ఏ రాష్ట్ర సీఎంకు సమస్య వచ్చినా మేం మద్దతిస్తాం
ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వానికి కేంద్రం గౌరవమివ్వాలని మమతా బెనర్జీ అన్నారు. ప్రతిపక్షాలకు కూడా తగిన గౌరవం ఇవ్వాలని కేంద్రానికి సూచించారు. నాలుగు నెలలుగా ఢిల్లీలో పాలన నిలిచిపోయిందని, ప్రజలు ఎక్కడికి వెళ్లాలని, ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానిది తప్పు ఉంటే తప్పు అని చెప్పాలే గానీ నాలుగు నెలలుగా సమస్య అలాగే వదిలేయడం సరికాదన్నారు. ఇది రాజ్యాంగ సంక్షోభం అవుతుందన్నారు. కేజ్రీవాల్ ధర్నా చేస్తున్నట్లుగా రేపు అన్ని రాష్ట్రాల్లో చేస్తే పరిస్థితి ఏమిటన్నారు. ఏ రాష్ట్ర మఖ్యమంత్రికి ఇలాంటి సమస్య తలెత్తినా తాము మద్దతిస్తామన్నారు.