చంద్రబాబుకు పొంచివున్న ప్రమాదం?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు అదనపు భద్రత కల్పించాలని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. 18వ తేదీ నుంచి తమ నేత కడప, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారంటూ పర్యటన వివరాలను కూడా లేఖలో పేర్కొన్నారు. 18న కడప, 19న ప్రకాశం జిల్లా గిద్దలూరు, 20న మార్కాపురం, 21న యర్రగొండపాలెంలో పర్యటిస్తారని తెలిపారు.
ఏప్రిల్ 20వ తేదీన చంద్రబాబు పుట్టినరోజు కాబట్టి పెద్దసంఖ్యలో ప్రజలు హాజరవుతారని, ఆయనకు ఎన్ ఎస్ జీ భద్ర ఉందని, ఆయన సమావేశాలపై రాజకీయ ప్రత్యర్థులు, అసాంఘిక శక్తులు టార్గెట్ చేసే అవకాశం ఉందని, అదనపు భద్రత అందుకే కోరుతున్నామని, చంద్రబాబు పర్యటనకు ఎటువంటి అడ్డంకులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బీటెక్ రవికి భద్రత తొలగించడంపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. రవికి భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీకి లేఖ రాశారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగిసందనే వంక చెబుతూ భద్రతను తొలగించడం సరికాదని, 2006 నుంచి 1ప్లస్ 1 సెక్యూరిటీ ఉందని, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి రవికి బెదిరింపులు వస్తున్నాయని, ఆయనకు భద్రత కొనసాగించాలనన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మార్చి 13వ తేదీన రవి కాన్వాయ్ పై గూండాలు దాడిచేశారని, అందులో ఆయన కారు ధ్వంసమైందనే విషయాన్ని ఆ లేఖలో గుర్తుచేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బీటెక్ రవిని నిందితుడిగా చేర్చాలని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి సమయంలో బిటెక్ రవికి ఏదైనా హాని జరిగితే పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కడప జిల్లాలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రవికి భద్రతను కొనసాగించాలని కోరారు.












Click it and Unblock the Notifications