నిలకడగానే అచ్చెన్నాయుడు ఆరోగ్యం- ఇన్ఫెక్షన్ సమస్య- సర్జరీ అవసరం లేదన్న డాక్టర్లు
రెండు రోజుల క్రితం శస్త్ర చికిత్స చేయించుకున్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని గుంటూరు జీజీహెచ్ డాక్టర్లు ప్రకటించారు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయిన తర్వాత ఏసీబీ అధికారులు ఆయన్ను నిన్న రాత్రి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా.... రెండు వారాల పాటు రిమాండ్ విధించారు. అయితే సీఎం జగన్ జోక్యంతో అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగా లేనందున ఆయన్ను జైలు అధికారుల అనుమతితో గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
ఆ ఒక్క లేఖతో అచ్చెన్నాయుడు అవినీతి బయటపడిందా ? అచ్చెన్న అవినీతి చిట్టా ఏసీబీ దగ్గర ఉందా ?
ఈ ఉదయం నుంచీ అచ్చెన్నాయుడుకు పరీక్షలు నిర్వహించిన జీజీహెచ్ డాక్టర్లు... ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తేల్చారు. శస్త్తచికిత్స కారణంగా అయిన గాయం రెండు మూడు రోజుల్లో నయమయ్యే అవకాశం ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. నిన్న ఎక్కువ సేపు ప్రయాణించడం వల్ల గాయం తీవ్రత పెరిగిందన్నారు. ఇన్ ఫెక్షన్ పెద్దదైతే మాత్రం మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావచ్చన్నారు. అయితే అందుకు 90 శాతం అవకాశం లేదన్నారు. ఇన్ ఫెక్షన్ తగ్గడానికి మాత్రం రెండు, మూడు రోజులు సమయం పడుతుందని డాక్టర్ సుధాకర్ వెల్లడించారు.
గుంటూరు జీజీహెచ్ డాక్టర్ల తాజా నివేదికతో టీడీపీ నేతలు, అభిమానులు, అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల క్రితం శస్త్తచికిత్స జరిగిన అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు కనీసం టిఫిన్ కూడా చేయనీయకుండా బలవంతంగా లాక్కెళ్లారని, దారి మధ్యలో ఆయనకు రక్త స్త్రావం కూడా అయిందని ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు. దీంతో అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్ధితిపై ఆందోళన నెలకొంది. దీంతో డాక్టర్లు వైద్య పరీక్షల తర్వాత క్లారిటీ ఇచ్చారు.