లగడపాటి నివాసంపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యులు, మూడు రోజుల క్రితం లోకసభలో పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటి రాజగోపాల్ నివాసం పైన తెలంగాణవాదులు గుడ్లు, టమాటాలతో దాడి చేశారు. పలువురు న్యాయవాదులు ద్విచక్ర వాహనాల పైన హైదరాబాదులోని లగడపాటి నివాసానికి చేరుకున్నారు. అక్కడ తమ వద్ద ఉన్న కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులను విసిరివేసారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీకి సమైక్యవాదులు
సమైక్యవాదులు ఢిల్లీ బాటపట్టారు. ఎపిఎన్జీవోలు ఆధ్వర్యంలో దేశ రాజధానిలో నిరసనల్లో పాల్గొనేందుకు సీమాంధ్ర జిల్లాలనుంచి ఉద్యోగులు భారీగా తరలివెళ్లారు. రాష్ట్ర విభజన తుదిదశకు చేరుకోవడంతో కేంద్రానికి తమ ఆకాంక్షను చాటడానికి 17, 18 తేదీల్లో ఎపిఎన్జీవోలు మహాధర్నా నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సమైక్యవాదులు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ పయనమయ్యారు. విజయవాడనుంచి శనివారం రాత్రి ఈ మేరకు నాలుగు రైళ్లు ఢిల్లీ బయలుదేరాయి. సమైక్యాంధ్ర నినాదాలతో విజయవాడ రైల్వేస్టేషన్ మారుమోగింది. దేశ రాజధానిలో సమైక్య భేరి మోగించేందుకు సీమాంధ్ర జిల్లాల నుంచి భారీగా ఉద్యోగులు తరలి వెళ్లారు.
చిత్తూరు, తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్ల నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బోగీలలో సుమారు వేలాది మందికి పైగా ఉద్యోగులు ఢిల్లీ వెళ్లారు. కర్నూలు జిల్లానుంచి భారీ సంఖ్యలోఉద్యోగులు ఢిల్లీ పయనమయ్యారు. ప్రత్యేక రైలును కర్నూలు రైల్వేస్టేషన్లో మంత్రి టిజి వెంకటేష్ జెండా ఊపి ప్రారంభించారు.