ప్రదీప్: బిటెక్ విద్యార్థినిపై దాడికి కారంపూడిలో ప్లాన్?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బండ్లగూడలోని అరోరా కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థినిపై దాడికి ప్రణాళిక గుంటూరు జిల్లా మాచర్ల మండలం కారంపూడిలోనే రూపొందిందనే వార్తలు వస్తున్నాయి. అప్పటి వరకు హైదరాబాదు రాంనగర్లోని తన సోదరి వద్ద ఉంటున్న ప్రదీప్ కొద్దిరోజుల క్రితమే అక్కడికి వెళ్లాడు. అప్పటికే విద్యార్థినిపై పగ పెంచుకున్నాడు.
గత నెలలో ఆమె తల్లిదండ్రులు ముషీరా బాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశా లున్నాయని ముందుగా ఊహించాడు. ఆ కారణంగానే ప్రదీప్ కారంపూడి ఉడాయించాడని తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చాడు. ఇంట్లో తల్లిదండ్రులకు సాయిబాబా పూజ కోసం సామగ్రి కొనుగోలు చేసి వస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రదీప్ సోదరి పోలీసులకు చెప్పింది.
మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్న ప్రదీప్ ఆ విద్యార్థిని కదలికలపై కన్నేశాడు. పథకం ఓకే అనుకున్న తర్వాత కొబ్బరిబొండాలు కొట్టే కత్తిని సంపాదించి బ్యాగ్లో పెట్టుకున్నాడు. ముందుగా విద్యార్థిని చంపేసిన తర్వాత తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే విష పదార్థాన్ని బ్యాగ్లో తీసుకెళ్లాడు. విద్యార్థినిపై దాడికి ఉపయోగించిన కత్తి తన సోదరి ఇంట్లో నుంచి తీసుకున్నాడా? లేక స్నేహితుల వద్ద తీసుకున్నాడా? అని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
హోలీలో సరదాలు...
మూడేళ్లుగా బీటెక్ విద్యార్థినిని వేధిస్తున్న ప్రదీప్కుమార్లో హోలీ పండుగ కాస్తా ఆశలు రేపింది. ఈ పండుగ సందర్భంగా గల్లీలోని ప్రజలంతా సరదాగా ఒకరిపై ఒకరు రంగులు చల్లు కుంటుంటారు. ఆ విధంగానే విద్యార్థిని ప్రదీప్పై రంగు చల్లిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ విద్యార్థిని తనను ప్రేమిస్తుందన్న భ్రమలోకి ప్రదీప్ వెళ్లాడని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత ఆమెను ఈ విషయంపై ప్రశ్నించగా తిరస్కరణ ఎదురైంది. అయినా అక్కడితో ఆగకుండా వెంటపడడం మొదలుపెట్టాడు. సెల్ఫోన్ లాక్కోవడం వంటి వెకిలి చేష్టలు చేశాడు. ప్రదీప్కుమార్ చేతిలో కత్తి ఉన్నప్పటికీ కళాశాల అధ్యాపకులు, సెక్యూరిటీ సిబ్బంది ధైర్యం చేసి అతడ్ని పట్టుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేసినా విద్యార్థిని జీవితాన్ని అంతం చేసేవాడేమోనని పలువురు విద్యార్థినులు చెప్పినట్లు ఓ వార్తాపత్రిక రాసింది.