కోర్టులో సాక్ష్యంకు ముందే..: పులివెందులలో టిడిపి నేతపై బాంబులు, కత్తులతో దాడి
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకా పులివెందులలో తెలుగుదేశం పార్టీ నాయకుడి పైన సోమవారం నాడు దాడి జరిగింది. ప్రత్యర్థులు టిడిపి నేత పైన బాంబులు, కత్తులతో దాడి చేశారు.
కడప జిల్లా పులివెందుల మండలంలోని నామాలగుండు సమీపంలో టిడిపి నాయకుడు శంకరప్ప పైన ఈ రోజు ఉదయం బాంబులు, కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో శంకరప్ప చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం పులివెందుల ఆసుపత్రికి తరలించారు.
ఓ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో శంకరప్ప కోర్టులో సాక్ష్యం చెప్పవలసి ఉంది. ఈ నేపథ్యంలో అతడిపై హత్యాయత్నం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసారు. దర్యాఫ్తు చేపట్టారు. కాగా, శంకరప్ప స్వస్థలం అనంతపురం జిల్లా తలుపుల మండలంలోని వేల్పుల గ్రామం.