ఓవైపు దాడులు, మరోవైపు చేరికలు- జగన్ ద్విముఖ వ్యూహం ఫలిస్తుందా ?
ఏపీలో జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గతేడాది అసెంబ్లీ ఎన్నికల ఫీట్ ను ఎలాగైనా రిపీట్ చేయాలని భావిస్తున్న సీఎం జగన్ చాలా పట్టుదలగా కనిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైతే మంత్రులకు కూడా ఉద్వాసన తప్పదని తేల్చిచెప్పిన జగన్... నియోజకవర్గాల్లో పరిస్ధితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించినట్లు అర్ధమవుతోంది. దీంతో వైసీపీ నేతలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ దాడులకు దిగుతున్నారు. అదే సమయంలో వైసీపీలో టీడీపీ నుంచి చేరికలు కూడా ఓ రేంజ్ లో కొనసాగుతున్నాయి. దీంతో జగన్ ద్విముఖ వ్యూహం రచించారా అన్న చర్చ మొదలైంది.

ఆసక్తికరంగా స్ధానిక పోరు
ఏపీలో స్ధానిక పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ నెలాఖరులోపు పంచాయతీలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక ఎన్నికలు కూడా పూర్తయ్యే అవకాశం ఉండటంతో తక్కువ సమయంలో ఫలితాన్ని రాబట్టేందుకు వైసీపీ, టీడీపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ దాడులకు పాల్పడుతుండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ దాడులు కాస్తా ముదిరి అభ్యర్దుల నుంచి టీడీపీ ప్రజాప్రతినిధుల వరకూ వెళ్లడంతో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు గాయాలయ్యాయి.

మరోవైపు వైసీపీలోకి వలసలు
స్ధానిక పోరులో ఎలాగైనా ఆధిపత్యం నిరూపించుకోవాలని తహతహలాడుతున్న వైసీపీ క్షేత్రస్ధాయిలో టీడీపీని దాడులతో భయపెడుతూనే మరోవైపు సైకిల్ పార్టీ నుంచి భారీగా వలసలను ప్రోత్సహిస్తోంది. గత రెండు రోజుల్లోనే దాదాపు 10 మంది మాజీ ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు సైతం వైసీపీ తీర్ధం పుచ్చుకోవడాన్ని బట్టి చూస్తే వలసల జోరు ఏ స్ధాయిలో ఉందో అర్ధమవుతోంది. రాబోయే రోజుల్లో మరింత మంది టీడీపీ నేతలు వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

జగన్ ద్విముఖ వ్యూహం
టీడీపీ నేతలపై ఓవైపు దాడులు, మరోవైపు పార్టీలోకి వలసలు కొనసాగిస్తూ వైసీపీ స్ధానిక పోరుకు ముందే తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటోంది. స్ధానిక ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా రాష్ట్రంలో ఇబ్బందికర పరిణామాలు ఉంటాయని భావించిన జగన్.. ముందుజాగ్రత్త చర్యగా అటు దాడులను, ఇటు వలసలను ఏకకాలంలో ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పదేపదే ప్రస్తావిస్తూ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.
స్ధానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే ఇలాంటి పరిస్ధితి ఉంటే ఎన్నికల పోలింగ్ నాటికి పరిస్ధితి మరింత దారుణంగా ఉన్నా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.

జగన్ వ్యూహం ఫలిస్తుందా ?
ఏపీలో తాజా పరిణామాలను గమనిస్తే... ఓవైపు దాడులు, మరోవైపు వలసలతో విపక్ష టీడీపీని సొదిలేనే లేకుండా చేయాలన్న వైసీపీ అధినేత ద్విముఖ వ్యూహం ఫలిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారం చేతిలో లేకపోయినా 151 సీట్లతో ఫలితాలను శాసించిన వైసీపీ.. ఈసారి అధికారం చేతిలో ఉండి కూడా ఆ ఫీట్ ను రిపీట్ చేయలేకపోతే జగన్ మేనియా తగ్గిందన్న విమర్శలు వస్తాయన్న ప్రచారం ఉంది. అందుకే రాష్ట్రంలో తమ ప్రభుత్వంపై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని అయితే ఎన్నికలను ఏకపక్షంగా మార్చేయడం లేదా దాదాపుగా క్లీన్ స్వీప్ చేయడమే జగన్ లక్ష్యంగా కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications