అయేషా కేసు: ఎవరీ సత్యంబాబు, అంతా నాటకీయంగా...
వైఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర సంచలనం సృష్టించిన అయేషా హత్య కేసులో సత్యంబాబును అరెస్టు చేశారు. చలాకీగా ఉండే సత్యంబాబు తీవ్ర వ్యాధికి గురై...
విజయవాడ: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అయేషా హత్య కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక రకంగా వైయస్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. వంద మంది దోషులు తప్పించుకోవచ్చు గానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనే మౌలిక సూత్రానికి భిన్నంగా సత్యంబాబు ఎనిమిదేళ్లు జైలులో గడిపాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సత్యంబాబును శుక్రవారం హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దర్యాప్తు అధికారుల తీరును తప్పుబడుతూ, సత్యంబాబుకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
అయేషా మరణించిన సంఘటన తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైయస్ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేశారు. అందులో చాలా వరకు ఆయన విజయం సాధించారు కూడా. అయితే, సత్యంబాబు అరెస్టు నుంచి చివరి వరకు పలు నాటకీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అయేషా ఎవరు, ఏం జరిగింది...
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఇక్బాల్ బాషా, శంషాద్బేగం దంపతుల కూతురు ఆయేషామీరా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కళాశాలలో బి ఫార్మసీ చదువుతూ అక్కడే శ్రీ దుర్గా హాస్టల్లో ఉండేది. దురదృష్టవశాత్తు 2007 డిసెంబర్ 26న హాస్టల్లోనే హత్యకు గురైంది. వైయస్ మంత్రివర్గంలో మున్సిపల్ శాఖను నిర్వహిస్తున్న కోనేరు రంగారావు మనుమడి ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆందోళనలు తీవ్రతరం...
న్యాయవాదులు, ప్రజా, పౌర సంఘాల కార్యకర్తలతో పాటు అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు, ఆయేషా తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.. జాతీయ మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. కమిషన్ సభ్యురాలైన నిర్మలా వెంకటేశన్ విజయవాడ నగరానికి చేరుకుని న్యాయ విచారణ చేపట్టారు. కోనేరు మనుమడితోపాటు, హాస్టల్ వార్డెన్ ఐనంపూడి పద్మ, ఆమె భర్త కృష్ణారావు ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి.
తెర మీదికి లడ్డూ ఇలా..
ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో నిందితులను గుర్తించే పనిలో భాగంగా పోలీసులు గుర్వీందర్ సింగ్ అలియాస్ లడ్డూ అనే చైన్స్నాచర్ను తెర మీదకు తెచ్చారు. స్నాచింగ్లకు పాల్పడుతూ యువతులపై అత్యాచారానికి పాల్పడే అలవాటు ఉందనే ఆరోపణలతో లడ్డూని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాని చేతులు, కాలి ముద్రలు తేడా రావడంతో న్యాయనిపుణుల సలహా మేరకు సాంకేతిక కారణాలతో లడ్డూ నిందితుడు కాదని పోలీసులు వెనక్కి తగ్గారు.
సత్యంబాబును ఇలా ఇరికించారు...
ఆయేషామీరా కేసులో నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు సాగించిన పోలీసులు నందిగామ మండలం అనాసాగర్కు చెందిన పిడతల సత్యంబాబును ఇందులో ఇరికించేశారు. తాపీ పని చేసుకుంటూ చలాకీగా తిరుగుతున్న సత్యంబాబును పట్టుకొచ్చి ఆయేషాపై అత్యాచారం, హత్య చేశాడంటూ ప్రాథమిక ఆధారాలు లభించాయంటూ 2008 ఆగస్టు 15న అరెస్టు చేశారు.
సత్యంబాబుకు ఇలా నరాల వ్యాధి...
విజయవాడ జైలులో రిమాండులో ఉన్న సత్యంబాబుకు నరాల సంబంధ వ్యాధి సోకింది. దీంతో కోర్టు ఆదేశాలతో హైదరాబాద్ తరలించి వైద్య చికిత్సలు అందించారు. అప్పటికే కాళ్ళు రెండు చచ్చుబడి నడవలేని దుస్థితిలో అతను పడ్డాడు. అతని కాళ్ళకు, చేతులకు బేడీలు వేసి ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువస్తుండగా సూర్యాపేట వద్ద తప్పించుకున్నట్లు పోలీసులు వింత ప్రచారం తెర మీదకు తీసుకువచ్చారు. ఆగి ఉన్న బస్సు కిటికీ నుంచి నడవలేని సత్యంబాబు దూకి పారిపోయాడని చెప్పారు.
సత్యంబాబు పారిపోయాడంటూ..
సత్యంబాబు పారిపోయాడని పోలీసులు చెప్పడంతో ఆందోళన తలెత్తింది. సత్యంబాబును ఎన్కౌంటర్ చేసేందుకే వ్యూహం పన్నారంటూ పోలీసులపై ఆరోణపలు తీవ్రంగా వచ్చాయి. పౌరసంఘాలు తెర మీదికి వచ్చాయి. దాంతో సత్యంబాబును తిరిగి తెర మీదికి తెచ్చారు. పెనుగంచిప్రోలు వద్ద సంచరిస్తుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
కింది కోర్టులో జీవిత ఖైదు...
సత్యంబాబునే అసలు దోషిగా నిర్ధారించిన పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో అతనిపై ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన సాక్ష్యాల ఆధారంగా విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సత్యంబాబుకు జీవితఖైదు విధిస్తూ 2009 సెప్టెంబర్ 29 తీర్పు చెప్పింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పిడతల సత్యంబాబు నిర్దోషిగా హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.
అప్పటి పోలీసు అధికారులు వీరే...
ఆయేషామీరా హత్య జరిగినప్పుడు విజయవాడ నగర పోలీసు కమిషనర్గా సివి ఆనంద్ ఉన్నారు. ఇప్పుడు ఈయన తెలంగాణ క్యాడర్లో పని చేస్తున్నారు. ఘటన జరిగినప్పుడు ఇబ్రహీంపట్నం సిఐగా పని చేసిన సుంకర మురళీమోహనరావు ప్రస్తుతం డిఎస్పీ హోదాలో గోదావరి జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు. స్టేషన్ ఎస్ఐగా ఉన్న జి శ్రీనివాస్ ఇప్పుడు విజయవాడలోని సిఎంఎస్ సిఐగా పని చేస్తున్నారు. ఇక ఘటన జరిగినప్పుడు పని చేసిన ఇద్దరు ఏసిపిలు లక్కరాజు విజయ్కుమార్, ప్రకాశరావులు పదవీ విరమణ చేశారు. హత్య జరగ్గానే ఎస్ఐ శ్రీనివాస్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆతర్వాత సిఐ మురళీమోహనరావు దర్యాప్తు చేపట్టారు. కేసు స్వభావాన్ని బట్టి ఏసిపి రంగంలోకి దిగి దర్యాప్తు సాగించారు.
అయేషా కేసులో అసలు దోషులెవరు...
సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు చెప్పడంతో అసలు దోషులు ఎవరు అనేది తిరిగి మిస్టరీగానే మారింది. అప్పట్లో వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని కేసును తిరిగి తెరిచే అవకాశం ఉంటుందా.... అప్పటి వైఎస్ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను ఇప్పటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం పట్టించుకుందా...