టీటీడీ సహాయం కోరిన అయోధ్య రామమందిరం ట్రస్ట్..
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని 77,483 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,276 మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. హుండీ ద్వారా మూడు కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
మరోవంక- అయోధ్య రామమందిరానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీ రెట్టింపు అవుతోంది. వేల మంది అయోధ్య రాముడిని దర్శించుకుంటోన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అటు అయోధ్యానగరం నిండిపోతోంది. అక్కడి ప్రయాణ ప్రాంగణాన్నీ కిటకిటలాడుతున్నాయి.

అయోధ్య ఆలయానికి వచ్చే భక్తులను నియంత్రించడం ఇప్పడొక కొత్త సమస్యగా మారింది. ఉన్న పరిమిత సమయంలోనే వేలాదిమందికి రాములవారి దర్శనభాగ్యాన్ని కల్పించడం.. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు సవాల్గా మారింది. రద్దీ నియంత్రణపై వారికి అనుభవం లేకపోవడమే దీనికి కారణం.
ఈ నేపథ్యంలో అయోధ్య ట్రస్ట్ ప్రతినిధులు.. టీటీడీ సహాయాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలో- అయోధ్య ట్రస్ట్ ఆహ్వానం మేరకు టీటీడీ కార్యనిర్వాహణాధికారి ఏవీ ధర్మారెడ్డి శనివారం సాయంత్రం అయోధ్యకు వెళ్లారు. రామ్ లల్లాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అయోధ్య ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ అనిల్ మిశ్రా, గోపాల్ జి, జగదీష్ ఆఫ్లే, గిరీష్ సహస్ర భోజని, విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి రాఘవులు, డిఎస్ఎన్ మూర్తి ఇందులో పాల్గొన్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, క్యూ లైన్ల నిర్వహణ, ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ బాలరాముడి దర్శన భాగ్యాన్ని కల్పించడం.. వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించారు.
రామమందిరానికి వచ్చే ప్రతి భక్తుడికీ స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలనే విషయాల గురించి వారికి వివరించారు. క్యూ లైన్ల నిర్వహణకు సంబంధించి టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు ట్రస్ట్ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications