సీఎం జగన్తో ఆయుష్ కమిషనర్ భేటీ-ఆనందయ్య మందుపై చర్చ-ఆ తర్వాతే పంపిణీపై నిర్ణయం...
ఆనందయ్య మందును తాము ఎక్కువ చేసి చెప్పడం లేదని, అలాగని కించపరచట్లేదని ఆయుష్ కమిషనర్ రాములు నాయక్ పేర్కొన్నారు. మందుపై ఐదారు రోజుల్లో నిపుణుల నివేదిక వస్తుందని... దాన్ని పరిశీలించాక ఒక నిర్దారణకు వస్తామని చెప్పారు. ఆనందయ్య మందు కరోనా కట్టడికి పనిచేస్తుందో లేదో నివేదికను పరిశీలించాకే చెప్పగలమన్నారు. ఆనందయ్య ఇస్తున్న మందులో హానికారక పదార్థాలేవీ లేవని మరోసారి స్పష్టం చేశారు. అందులో వాడుతున్న మూలికలన్నీ ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నవేనని అన్నారు.ఆనందయ్య ఔషధం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో చర్చించామని, వీలైనంత త్వరగా పరిశోధన పూర్తి చేయాలిని ఆయన ఆదేశించినట్లు వెల్లడించారు.
ఆనందయ్య మందులో వాడుతున్న 18 రకాల మూలికలపై ఇప్పటికే అధ్యయనం చేశామని రాములు నాయక్ తెలిపారు. మందు వాడిన తర్వాత స్వస్థత చేకూరిందని చాలామంది చెబుతున్నారని... అయితే చట్టపరంగా ఇప్పుడే దీన్ని ఆయుర్వేద ఔషధంగా చెప్పలేమని అన్నారు. క్లినికల్ ట్రయల్స్ నివేదికను బట్టి అది ఆయుర్వేద ఔషధమా కాదా అన్నది నిర్దారణ అవుతుందన్నారు.
ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదని తేలిన తర్వాతే ప్రజలకు పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ (సీసీఆర్ఏఎస్) నుంచి నివేదిక వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆనందయ్య మందును ఇప్పటివరకూ 80 వేల మందికి పంపిణీ చేసినట్టు చెబుతున్నారని పేర్కొన్నారు. వేల మందిలో ఒకరిద్దరికి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, ఇదేమంత పెద్ద విషయం కాదని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే ఆయుష్ కమిషనర్ రాములు,ఐసీఎంఆర్ బృందాలు ఆనందయ్య మందును పరిశీలించిన సంగతి తెలిసిందే. మందుపై ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలోని తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కాలేజీ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. ఆనందయ్య మందు తీసుకున్నవారిలో 500 మంది నుంచి శాంపిల్స్ సేకరించి అధ్యయనం చేయనున్నారు. అనంతరం క్లినికల్ ట్రయల్స్ కూడా ఉంటాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే ట్రయల్స్ మనుషుల పైనా లేక జంతువుల పైనా అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుందన్నారు. అధ్యయనం తర్వాత నివేదికను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ (సీసీఆర్ఏఎస్)కు పంపించనున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయి నివేదికలు అందిన తర్వాత ప్రభుత్వం మందు పంపిణీపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.