భారీ స్థాయిలో అవినీతి: అయ్యన్న సంచలన ఆరోపణలు
విశాఖపట్నం: రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీలో భారీ దోపిడీ జరుగుతోందని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల వద్ద నుంచి కాంట్రాక్టర్లు బారీ మొత్తంలో లంచాలను తీసుకుంటున్నారని మంత్రి అయ్యన్న ఆరోపించారు. రోజుకు 10 నుంచి 12గంటలపాటు పనిచేయిస్తూ వారికి పూర్తిస్థాయిలో జీతభ్యాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమీషన్ పేరుతో మూడోవంతు వారి కష్టార్జితాన్ని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అప్పనంగా దోచేస్తున్నారని మండిపడ్డారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు అమలు చేయడం లేదని అన్నారు. కలెక్టర్ సమక్షంలోనే ఈ పోస్టుల భర్తీ జరిగితే అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు.

అవినీతికి పాల్పడే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని సమావేశంలో పాల్గొన్న మరో మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.
అక్టోబరు 7న అధికారులు, శాసనసభ్యులు, ఎంపీలతో సమావేశం నిర్వహిన్నామని, కీలక అంశాలపై ఈ భేటీలో చర్చిస్తామన్నారు.
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి.నారాయణను సైతం సమీక్షకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. నగరంలో ఇళ్ల నిర్మాణాలతో పాటు, ఇతరత్రా సమస్యలున్నాయని, వాటిని ఎలా పరిష్కరించాలనే అంశంపై అధికారులతో చర్చించి ప్రణాళిక ప్రకారం పరిష్కరించేందుకు చర్యలను తీసుకుంటామని వివరించారు.
నగరంలో ఇంటింటికీ తెదేపా కార్యక్రమం నిర్వహణ సంతృప్తికరంగా ఉందన్నారు. కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను యాప్లో పొందపర్చుతున్నామని, దశలవారీ వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లాలో పార్టీ నేతలకు నామినేషన్ పదవుల పంపిణీ వ్యవహారంపై వచ్చే నెల 7న జరగనున్న సమావేశంలో చర్చిస్తామన్నారు.












Click it and Unblock the Notifications