టీడీపీ, బీజేపీ, జనసేనలపై అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు: పవన్ ఏమంటారో?
వచ్చే ఎన్నికలపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని రాష్ట్ర రహదారులు, భవనాల మంత్రి చింతకాయల అ
విశాఖపట్నం: వచ్చే ఎన్నికలపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని రాష్ట్ర రహదారులు, భవనాల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. సోమవారం రాత్రి విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అభినందన సభలో ఆయన ప్రసంగించారు.
ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి చెందుతోందంటే అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారమే ప్రధాన కారణమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రూ.16 వేల కోట్ల లోటులో ఉన్న నవ్యాంధ్రప్రదేశ్కు ప్రధాని నరేంద్ర మోడీ అండగా ఉండబట్టే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతోందన్నారు.
రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందనడం సరికాదని, ఏడాదికి రూ.ఆరు వేల కోట్ల ఉపాధి హామీ నిధులు ఇస్తున్నందునే గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతోందని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం ఇంతవరకు రూ.73 వేల కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీతో టీడీపీ సయోధ్య కొనసాగిస్తుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీతోపాటు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో కూడా కలిసి టీడీపీ ఉమ్మడిగా పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని, తాను చెప్పిన విషయాన్ని ఎవరైనా కాగితం మీద రాసి దాచిపెట్టుకోవచ్చని ధీమాగా చెప్పారు. అభివృద్ధి కోసం కలిసి పనిచేయడంలో తప్పులేదన్నారు.
జనసేన ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామి పక్షం కాదని, పార్టీ నిర్మాణం పూర్తయ్యాకే పొత్తుల గురించి ఆలోచిస్తామన్నారు. అయితే, అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గానీ, ఆ పార్టీ నేతలుగానీ ఇప్పటి వరకు స్పందించలేదు.