సీఎం పెషీ అధికారులపై ఏపీ మంత్రి చిందులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒకరు ముఖ్యమంత్రి పెషీ అధికారుల పైన చిందులు తొక్కారు! శుక్రవారం అధికారుల బదిలీల్లో మంత్రులకు ఏమాత్రం ప్రాధాన్యమివ్వరా అంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు చంద్రబాబు కార్యాలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగపూర్ పర్యటన ముగించుకుని రాగానే చంద్రబాబుకు చెబుతానని ఒంటికాలిపై లేచారని సమాచారం. పరిస్థతి చేయి దాటిపోతోందని గ్రహించిన సీఎంవో సిబ్బంది అయ్యన్నను సముదాయించారు. ఆయన అక్కడి నుండి రుసరుసలాడుతూ వెళ్లిపోయారు.
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం సేకరించనున్న భూమి విషయంలో అనుసరించనున్న ల్యాండ్ పూలింగ్ విధానానికి చట్టబద్ధత కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. ల్యాండ్ పూలింగ్తో రైతులకు ఎలాంటి నష్టం రాదని, మరింత లాభదాయకమన్నారు.
ల్యాండ్ పూలింగ్ను ఆధారం చేసుకుని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన చేసిన ఆరోపణలు సరికాదన్నారు. చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.
శ్రీకాంత్ రెడ్డిపై మాగంటిఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పైన జూబ్లీహిల్స్ టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్రీకాంత్ రెడ్డికు హెరిటేజ్ సంస్థల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
శ్రీకాంత్ రెడ్డిపై అనేక కేసులున్నాయన్నారు. కేసుల్లో ఇరుకున్నవారు కూడా ఇతరులపై విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు. పార్టీ ఆఫీస్ను నడపలేక, మూసేసి, ఇంటి నుంచి నడిపించుకుంటున్నారని, అలాంటి పార్టీకి చెందిన నేతలు మాట్లాడితే జనాలు పట్టించుకోరన్నారు.