తగ్గేదేలే.. అయ్యన్నపాత్రుడు వర్సెస్ సాయిరెడ్డి: దమ్ముంటే రావాలని సవాల్.. డేట్, టైమ్ చెప్పమన్న వైసీపీఎంపీ
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గత కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టారు అంటూ మున్సిపల్ అధికారులు టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ గోడను కూల్చివేయటంతో మొదలైన రగడ నేటికీ కొనసాగుతుంది
అయ్యన్న ఇంటిగోడ కూల్చివేత.. కొనసాగుతున్న రాజకీయ రగడ
ఇటీవల అయ్యన్న ఇంటి గోడను కూల్చివేసిన అధికారుల తీరును నిరసిస్తూ ఆయన అనుచరులు, టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో నర్సీపట్నంలో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు కూల్చివేతను నిలిపివేశారు. ఇక ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో నేటికీ అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణం గా మారింది.
దమ్ముంటే నేరుగా నర్సీపట్నం వచ్చేయ్.. తేల్చుకుందాం సాయిరెడ్డి : అయ్యన్న ట్వీట్
ఇక నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి గూడ కూల్చివేతపై తాజాగా అయ్యన్నపాత్రుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. నన్ను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నంలోనే ఉంది అని పేర్కొన్న అయ్యన్నపాత్రుడు జేసిబిలు,ఐపిఎస్ లు, ఆర్డీవోలు, వందల సంఖ్యలో పోలీసులు, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, సోషల్ మీడియా కేసులు అంటూ టిడిపి నేతలను ఎదుర్కోవడానికి వైసిపి ప్రభుత్వం చేస్తున్న దానిపై మండిపడ్డారు . అంత భయం ఎందుకు సాయి రెడ్డి? దమ్ముంటే నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చేయ్ తేల్చుకుందాం అంటూ అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు.
నేను నర్సీపట్నం వస్తా. డేట్, టైం చెప్పు తాగుబోతు: సాయిరెడ్డి కౌంటర్
ఇక ఈ సవాల్ ను స్వీకరించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా అయ్యన్నపాత్రుడు ని టార్గెట్ చేశారు. అయ్యన్నపాత్రుడు పిల్లి లాంటి వాడిని, కానీ పులిలా ఫీల్ అవుతాడు అంటూ మండిపడ్డారు. పిల్లి తనను ఎవరు వేటాడతారా అని ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది అని పేర్కొన్న విజయసాయిరెడ్డి కానీ పిల్లి, పులి కన్నా గొప్పదాన్నని తనకు తానే అనుకుంటుంది అంటూ అయ్యన్నపాత్రుడు ని టార్గెట్ చేశారు . నేను నర్సీపట్నం వస్తా. డేట్, టైం చెప్పు తాగుబోతు అంటూ ఆయన సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.
పారిపోకుండా నిలబడు గంజాయి అన్న సాయిరెడ్డి .. అయ్యన్న ఏమంటారో?
అయినా నువ్వు అఙ్ఞాతంలోకి పోయావటకదా! పారిపోకుండా నిలబడు గంజాయి అంటూ అయ్యన్నపాత్రుడు పై తీవ్రస్థాయిలో విజయ సాయి రెడ్డి విరుచుకుపడ్డారు. అంతేకాదు అయ్యన్న ఇంటి ప్రహరీ కూల్చివేతపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు తాత్కాలిక ఊరట అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మరి విజయసాయి రెడ్డి నర్సీపట్నం వెళ్లేందుకు రెడీ అని ప్రకటించిన నేపథ్యంలో, దీనికి అయ్యన్నపాత్రుడు సిద్ధమంటారా? లేదా అనేది? రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారింది.