రెండో పెళ్లికి అడ్డొస్తుందని భార్య హత్య, బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబంలో నెలకొన్న విభేదాలతో భార్యను ఓ భర్త హత్య చేసిన సంఘటన ఎంఏ నగర్లో జరిగింది. భార్యపై అనుమానంతో పాటు అనారోగ్యంతో ఉందనే కారణంతో సదరు వ్యక్తి రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం అడ్డుగా ఉన్న భార్యను తొలగించుకోవాలనుకున్నాడు.
బుధవారం తెల్లవారుజామున సిమెంటు ఇటుకతో పాటు కుక్కర్ మూతతో భార్య తలపై మోది హత్య చేసి పరారయ్యాడు. పండరి, అర్చన (25) దంపతులు ఐదు సంవత్సరాల క్రితం మియాపూర్లోని ఎంఎ నగర్లో స్థిరపడ్డారు. పండరి చాట్ బండి నడుపుతున్నాడు. కొన్నినెలల క్రితం అర్చన అనారోగ్యానికి గురైంది. వారికి బాలాజీ, శివానీ, దీపిక అనే ముగ్గురు పిల్లలున్నారు.
దీంతో తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు పండరి బంధువులకు చెప్పాడు. ఇందుకు అర్చనతో పాటు బంధువులు అంగీకరించలేదు. ఈ విషయమై నెల రోజుల క్రితం పండరి భార్యతో గొడవపడ్డాడు. దీంతో అర్చన పుట్టింటికి వెళ్లి నాలుగు రోజుల క్రితం తిరిగొచ్చింది.
బుధవారం తెల్లవారుజామున భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన పండరి సిమెంట్ ఇటుక, కుక్కర్తో అర్చన తలపై మోది హత్య చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. అర్చన మృతితో ఆమె ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. సంఘటన స్థలాన్ని పోలీస్లు పరిశీలించారు.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ఎంత చదివినా మార్కులు సరిగా రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ బీటెక్ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎలమకన్య గ్రామానికి చెందిన మహాత్మ కుటుంబ సభ్యులతో కలిసి హయత్నగర్ మదర్ డెయిరీ సమీపంలోని శుభోదయనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
అతడి కుమారుడు సంతోష్ (20) హయత్నగర్ మండల శివారులోని గుంతపల్లిలో గల ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఎంత చదివినా మార్కులు సరిగా రావడం లేదు, అమ్మానాన్నల ఆశయాలు నెరవేర్చలేకపోతున్నానంటూ బుధవారం రాత్రి 7.30 గంటలకు సూసైడ్ నోట్ రాసి ఇంట్లో చీరతో ఇనుపరాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.