నూతనత్వాన్ని ఆహ్వానించే బాబు..! ఆ విషయంలో మాత్రం పాత పద్దతే కావాలట..! ఎందుకో..?
హైదరాబాద్ : హైటెక్ సీఎంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బాబు. అలాంటిది బాబు ఇలా మాట్లాడటమేంటనే చర్చలు ఊపందుకున్నాయి. టెక్నాలజీకి ఆద్యుడిగా ముద్ర వేసుకున్న బాబుకి ఏమైంది..?అప్డేట్ కాలేకపోతున్నారా? లేక అవుట్ డేటెడ్ అయిపోయారా? లేదంటే రానున్న ఎన్నికల్లో ఆయనకేమైనా ఓటమి భయం పట్టుకుందా? అనే కోణంలో చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణలో ఈవీఎంల వల్లే కూటమి ఓడిపోయిందన్న విషయాన్ని బాబు బాగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు మళ్లీ పాత పద్ధతి ఐన బ్యాలట్ విధానాన్నే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉపయోగించాలని బాబు డిమాండ్ చేయడం చర్చనీయాంశమౌతోంది.
అంతా కొత్తదనమే..!ఆ విషయంలో మాత్రం పాత పద్దతే బెటర్ అంటున్న బాబు..!!
ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమి ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ప్రజాకూటమికి ఎదురైన ఈ పరాభవానికి కారణం చంద్రబాబే అని అన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయినా బాబు ఏ మాత్రం జంకకుండా ఓటమికి అసలు కారణాలేంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈవీఎం ల ట్యాపరింగ్ జరిగిందని ఎలక్షన్ కమీషన్పై ఇప్పటికే ఓ అపవాదు వినిపిస్తోంది. సరిగ్గా ఇదే పాయింట్ని బేస్ చేసుకొని చంద్రబాబు ఈవీఎం లపై విరుచుకు పడ్డారు. పాత పద్ధతైన బ్యాలెట్ విధానమే బెటర్ అని వ్యాఖ్యానించారు. అయితే.. హైటెక్కి అర్థం చెప్పిన బాబే ఇలా మాట్లాడటం ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.
ఈవియంలు వద్దు..! బ్యాలెట్ విధానమే బెటర్ అంటున్న బాబు..!!
ఏపీలో చంద్రబాబు పట్ల ప్రజలు సానుకూలంగా ఉండటం చూసి, కొంతమంది ఆయనేం మాట్లాడినా పెడర్థాలు వెతుకుతున్నట్టు ఏపీ సీయంవోలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో ప్రజాకూటమి ఓటమిలో చంద్రబాబును విలన్ చేసి, ఏపీ ఎన్నికల్లో ఆయన ప్రభావం లేకుండా చూడాలనేది కొందరి ప్రణాళికగా తెలుస్తోందని ఏపి టీడిపిలో చర్చ జరుగుతోంది. ఈ వీయంలలో సాంకేతిక లోపాన్ని సరిచేయకుండా ఏకపక్షంగా పనిచేసేలా రూపకల్పన చేస్తే ఎవరుకూడా చేసేది ఏమీ ఉండదని టీడిపి నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కుప్పంలో అనైతిక సర్వే..! బాబుకు వ్యతిరేకంగా ప్రతిపక్షం చేయిస్తోందంటున్న టీడిపి..!!
ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కొద్దిరోజులుగా ఓ గ్యాంగ్ హల్చల్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంటింటికీ తిరిగి పలు రకాల ప్రశ్నలు అడుగుతున్నారట ఆ గ్యాంగ్లోని సభ్యులు. వాళ్లు అడిగే ప్రశ్నల బట్టి చూస్తే సర్వే చేయడానికి వచ్చారని తెలసిపోతున్నట్టు స్థానికులు చెప్పుకొస్తున్నారు. అయితే సీఎం సొంత నియోజకవర్గం కావడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నట్టు టీడిపిలో చర్చ జరుగుతోంది.
బాబు వ్యతిరేకత ఉందంటున్న ప్రతిపక్షం..! ఖండిస్తున్న తెలుగుతమ్ముళ్లు..!!
ఇలాంటి పరిస్థితుల్లో కుప్పంలో జరుగుతున్న సర్వే వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. వ్యక్తిగత అవసరాలు, ప్రయోజనాలతోపాటు, స్థానిక నాయకుల పనితీరు, ఓట్ల సరళి గురించి కూడా వివరాలు అడుగుతున్నారట. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఈ సర్వే బృందాలను ప్రతిపక్ష పార్టీయే పంపించిందనే ప్రచారం జరుగుతోంది. సీఎం సొంత నియోజకవర్గంలో ఈ సర్వే జరపడం ద్వారా, ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన సమాచారాన్ని సేకరించి విస్తృతంగా ప్రచారం చేయవచ్చు అనే ప్లాన్ చేసిందట వైసీపీ. అయితే అక్కడి వైసీపీ నాయకులు మాత్రం అధికార పార్టీయే ఈ సర్వే జరిపిస్తోందని చెప్పుకురావడం కొసమెరుపు.