Badvel Bypoll: రికార్డు స్థాయి మెజారిటీపై కన్నేసిన వైసీపీ: కడప జిల్లా నేతలతో సజ్జల కీలక భేటీ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించే ఉప ఎన్నికలో భారీ మెజారిటీని సాధించే దిశగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపకపోవడం వల్ల ఇక ఈ ఉప ఎన్నికను వన్ సైడ్గా మార్చేయాలని భావిస్తోంది. ఈ దిశగా పార్టీ నాయకులను సమాయాత్తం చేస్తోంది. ఇప్పటికే ఈ ఉప ఎన్నక బాధ్యతను వైఎస్ జగన్.. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అప్పగించారు. బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే బరిలో ఉండటం వల్ల ఈ ఎన్నికను ఏకపక్షం చేయాలనే పట్టుదలతో ఉంది.
టీడీపీ బిగ్ స్కెచ్: బద్వేలులో పోటీ చేయకపోయినా: వైసీపీ ఓటుబ్యాంకును దెబ్బకొట్టేలా ప్లాన్
కడప జిల్లా పార్టీ నేతలతో సజ్జల భేటీ..
ఈ మధ్యాహ్నం పార్టీ సీనియర్ నాయకుడు, ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కడప జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. వారికి దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. బద్వేలు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న డాక్టర్ సుధను అత్యధిక మెజార్టీతో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయాలని చెప్పారు.
ఎన్నికల సమయంలో..
పేదల జీవితాలు మెరుగుపడాలనే సత్సంకల్పంతో వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే.. వారే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని, దాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఆర్భాటాలు చేసిన ప్రభుత్వాలను తాము చూశామని, దానికి విరుద్ధంగా అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను నెరవేర్చామని అన్నారు.
పార్టీ రహితంగా..
పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, పారదర్శకంగా వాటిని ప్రజలకు చేరవేస్తోందని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం పదవులు, పనుల్లో రిజర్వేషన్ను కల్పించామని అన్నారు. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి సందర్భాలను చూడలేదని అన్నారు. ప్రతి లబ్ధిదారుని ఇంటి వద్దకు ప్రభుత్వ సాయం నేరుగా అందుతోందని, ఎక్కడా అవినీతి, లంచగొండితనానికి అవకాశమే లేని పరిపాలనను వైఎస్ జగన్ అందిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. వలంటీర్, సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వరకు పరిపాలనను తీసుకువచ్చారని చెప్పారు.
విద్య, వైద్య రంగాల్లో
నాడు-నేడుతో విద్యా, వైద్య రంగాలను సమూలంగా ప్రభుత్వం మార్చివేసిందని, ఇతర రాష్ట్రాలు సైతం దీన్ని ఆదర్శంగా తీసుకున్నాయని సజ్జల చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తోన్న విష ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనేది ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని, ఈ నెల రోజుల్లో బద్వేలు నియోజకవర్గంలోని ప్రతి గడపకూ రెండు, మూడు సార్లు వెళ్లాలని చెప్పారు. ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం పెంచాలని కోరారు.