వాహనదారులకు కేంద్రం గుడ్ ఛాన్స్
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ సరఫరా గొలుసును దెబ్బతీసింది. దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. హార్మోజ్ స్ట్రెయిట్ ను ఇరాన్ మళ్లీ సీల్ చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో ఇంధన ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు భారీ ఊరట కల్పించే దిశగా అడుగలు వేసింది.
అధిక పరిమాణంలో ఇథనాల్ను కలిపిన పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 22 నుండి 30 శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. ఇంధన భద్రతను పెంపొందించడం, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. కేంద్రం తీసుకున్న ఈ చర్య క్లీన్ ఎనర్జీని మరింత ప్రోత్సహించినట్టయింది.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కొద్దిసేపటి కిందటే విడుదల అయింది. 22 నుండి 30 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్కు ఎక్సైజ్ సుంకం నుండి మినహాయింపు లభించింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్.. ఇథనాల్ వినియోగాన్ని భారీగా పెంచుకోవడంలో భాగంగా, వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఇథనాల్ ఉత్పత్తి, సరఫరాదారులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. దీని ఉత్పత్తిని మరింత పెంచడానికి దోహదపడినట్టవుతుంది.
ప్రస్తుతం రిటైల్ అవుట్లెట్లలో విక్రయించే సాధారణ పెట్రోల్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. ఇంధన అవసరాల కోసం భారత్ ముడి చమురు దిగుమతుపై ఎక్కువగా ఆధారపడుతోంది. చెరకు, ఇతర ధాన్యాల వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుండి దేశీయంగా లభించే ఇథనాల్ వాడకాన్ని పెంచడం ద్వారా, విదేశీ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది. అంతేకాకుండా గ్లోబల్ చమురు ధరల ఒడిదుడుకుల ప్రభావం నుంచి కూడా తప్పించుకోవడానికి ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.
ఈ తాజా పన్ను ఉపశమన చర్యల ద్వారా ఇథనాల్ వాటాను మరింతగా పెంచాలని భారత్ భావిస్తోంది. ఇంధన డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, దిగుమతి చేసుకునే చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, పర్యావరణ అనుకూల ఇంధనాలపై దృష్టి సారించడం ప్రభుత్వ వ్యూహంలో భాగం. వినియోగదారులపై దీని తక్షణ ప్రభావం పరిమితమే. అయినప్పటికీ.. ఇథనాల్ వాటాను పెంచే దిశగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఉత్పత్తిదారులను ప్రోత్సహించినట్టయింది.
ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ను 85 కంప్లైంట్ ఇంజిన్లు ఉన్న వాహనాల్లో మాత్రమే వాడాల్సి ఉంటుంది. దేశంలో లభ్యమయ్యే E20 పెట్రోల్లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటాయి. E85 ఇంధనంలో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమం ఉంటుంది. ఇథనాల్ వాడకం పెరగడం వల్ల పెట్రోల్ వినియోగం తగ్గి, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుండి దీన్ని తయారు చేస్తారు.












Click it and Unblock the Notifications