ఒకే వేదికపైకి నందమూరి కుటుంబం - నిమ్మకూరు వేదికగా : బాలయ్య - తారక్ స్పెషల్..!!
నందమూరి కుటుంబానికి మే 28 ప్రత్యేకమైన రోజు. ఈ ఏడాది మరింత స్పెషల్. దీంతో..నందమూరి ఫ్యామిలీ మొత్తం ఈ రోజున ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించేందుకె సిద్దమైంది. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఆయన జన్మదినం నాడు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. అటు టీడీపీ మహానాడు జరుగుతోంది. మహానాడు రెండో రోజున ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేసారు. టీడీపీ ఏర్పాటై 40 సంవత్సరాలు పూర్తయింది.
ఘనంగా నిర్వహించేలా
ఇదే ఏడాది ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రంగం సిద్దమైంది. దీంతో..28న ఉదయం నిమ్మకూరులో ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వేడుకల కోసం స్థానిక ఎన్టీఆర్ బసవతారకం ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించనున్నారు.
ఈ వేడుకలకు ఎన్టీఆర్ అభిమానులు, కుటుంబసభ్యులు, టీడీపీ ప్రముఖులు కూడా హాజరవుతారు. అతిరథుల రాకను పురస్కరించుకుని నిమ్మకూరులో స్వాగత బ్యానర్లు సిద్ధం చేస్తున్నారు. బాలయ్య నిమ్మకూరులో నివాళి అర్పించిన అనంతరం తెనాలి వెళ్తారు. అక్కడ పెమ్మసాని థియేటర్ వద్ద జరిగే వేడుకల్లో పాల్గొంటారు.
నందమూరి కుటుంబం ప్రత్యేకంగా
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా అక్కడ ఏడాది పాటు వారానికి అయిదు షో లు ఎన్టీఆర్ చిత్రాలు ప్రదర్శించాలని నిర్ణయించారు. ఆ తరువాత బాలయ్య మహానాడులో పాల్గొనేందుకు ఒంగోలు చేరుకుంటారు. ఇక, హైదరాబాద్ లో ఉదయం నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించనున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ - కళ్యాణ రాం సైతం అక్కడే నివాళి అర్పించి.. సందేశం ఇవ్వనున్నారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. నందమూరి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఏడాది పాటు ఉత్సవాలకు ప్రణాళికలు
ఇక, ఏడాది పాటు టీడీపీ నుంచి అదే విధంగా నందమూరి అభిమానులు ఈ శత జయంతి వేడుకలను నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేసారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఆయనకు ఇష్టమైన గండిపేటలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా టీడీపీ నేతలు అందరూ కలిసి ఈ వేడుకలు నిర్వహించేలా నిర్ణయించారు. దీనికి సంబంధించి రేపు టీడీపీ అధినేత చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇటు మహానాడు..అటు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలతో నందమూరి అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది.