పవన్ కళ్యాణ్తో పోల్చుకున్న బాలకృష్ణ: ఎంతకైనా తెగిస్తామంటూ కీలక వ్యాఖ్యలు
విజయనగరం: నారా లోకేష్ యువగళంలో ప్రజాగళం కదంతొక్కిందన్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. పాదయాత్రకు ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినా విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా 'యువగళం-నవశకం' పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. వైసీపీ అక్రమాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

యువగళం పాదయాత్రలో ఎంతో మందిప్రజలను లోకేష్ ఓదార్చారని బాలకృష్ణ చెప్పారు. ప్రజా సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారని ప్రశంసించారు. పవన్ కళ్యాణ్కు తనకు చాలా సారూప్యతలున్నాయన్నారు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ముక్కుసూటి మనిషని.. తాను కూడా అంతేనని చెప్పారు. ఇకముందు ఎంతకైనా తెగిస్తామని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో ఒక చెత్త ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా గాలికొదిలేశారని వైసీపీ సర్కారును విమర్శించారు. అమరావతికి భూములిచ్చిన రైతుల ఉద్యమాన్ని అణిచివేశారని మండిపడ్డారు బాలకృష్ణ. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పిన పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లుఅయినా పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. పోలవరం పూర్తి చేయలేని చేతకాని ప్రభుత్వం అంటూ వైసీపీ సర్కురుపై విరుచుకుపడ్డారు.
Naadhi nd పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన ఒకేలా ఉంటుంది - బాలయ్య గారు 🔥🔥@PawanKalyan #BalaKrishna
— 🦋🌸RaG భాగ్య నగరం పిల్ల (@RN_PSPK) December 20, 2023
pic.twitter.com/vDkK4uIobp
మరోవైపు, రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందని, డ్రగ్స్ దందాలో మాత్రం రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేశారని బాలకృష్ణ ఆరోపించారు. ల్యాండ్, శ్యాండ్ స్కాములతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాలేదని.. యువతకు ఉద్యోగాలు లేవన్నారు. వైసీపీ అక్రమాలు ఇలాగే కొనసాగితే ప్రపంచ పటంలో ఏపీ ఉండదని అన్నారు. సమయం లేదు మిత్రమా.. విజయమా.. వీర్ సర్వర్గమా? తేల్చుకోవాల్సిన పరిస్థితి మనదని బాలకృష్ణ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications