ఆ విషయంలో జగన్ ను కలిసేది లేదు: బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల అంశంపై తనదైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాను సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవబోనని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇటీవల చిరంజీవి బృందం సభ్యులు జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంలో సీఎంతో చర్చలు చేయడానికి తనను కూడా ఆహ్వానించారని, అయితే తాను రానని తేల్చి చెప్పానని బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టికెట్ ధరల విషయంలో జగన్ ను కలిసేది లేదన్న బాలయ్య
ఇదే సమయంలో తాను సినిమా బడ్జెట్ పెంచబోనని బాలయ్య స్పష్టం చేశారు. టికెట్ ధరలు తక్కువగా ఉన్న సమయంలోనే అఖండ సినిమా రిలీజ్ అయిందని, అది విజయవంతం కూడా అయిందని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. టికెట్టు రేట్లు తక్కువగా ఉన్నప్పుడు కూడా అఖండ సినిమా సక్సెస్ కావడం ఒక ఉదాహరణ అని, ఈ సినిమా టికెట్ల వ్యవహారంలో జగన్ ను కలిసేది లేదని బాలయ్య చెప్పుకొచ్చారు.

ఇటీవల సినీ రంగ సమస్యలపై జగన్ ను కలిసిన సినీ ప్రముఖులు
సినిమా టికెట్ల వ్యవహారం తో పాటు, సినీ పరిశ్రమ సమస్యలపై ఇటీవల చిరంజీవితో పాటు దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారు సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో మాట్లాడామని ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.త్వరలోనే సినిమా టికెట్ల విషయంలో గుడ్ న్యూస్ వింటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

చిరంజీవి అంతగా ప్రాధేయపడాలా? చంద్రబాబు అసహనం
సినీ ప్రముఖులు సీఎం జగన్ తో భేటీ అయిన తర్వాత ఈ భేటీపై సినీ వర్గాల నుండి రాజకీయ వర్గాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏపీ ప్రభుత్వం సినీ ప్రముఖులను కించపరిచేలా వ్యవహరించిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. స్వశక్తితో ఎదిగిన చిరంజీవి లాంటి వాళ్ళు ఏపీ సీఎం జగన్ వద్దకు వెళ్లి ప్రాధేయపడాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక సమస్యను సృష్టించి తానె పరిష్కారం చేసినట్టు జగన్ బిల్డప్ రాజకీయాలు చేస్తున్నారని పలువురు జగన్ ను విమర్శించారు.

జగన్ ను కలిసిన మంచు విష్ణు... తాజా పరిణామాలపై చర్చ
ఇదిలా ఉంటే తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు కలిశారు. గత మూడు నెలల క్రితం మా అధ్యక్షుడిగా గెలుపొందిన తర్వాత ఆయన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవడం ఇదే మొదటిసారి. సినీ రంగ సమస్యలపై, ఏపీ లో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు అంశంపై వారిరువురి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications