ఆత్మస్థైర్యం నింపారు: బాబుపై బాలకృష్ణ, 35లక్షల చెక్కు
విశాఖపట్నం: హుధుద్ తుఫాను వల్ల విశాఖ నగరానికి అపార నష్టం వాటిల్లందని సినీనటుడు, హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విశాఖలో కలిశారు. ఆయనకు తుఫాను బాధితుల సహాయార్థం రూ. 35లక్షల చెక్కును అందించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. పెను తుఫాను నేపథ్యంలో ఐదు రోజులుగా సిఎం చంద్రబాబు విశాఖలోనే ఉండి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు రాత్రింబవళ్లు సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ.. విశాఖ ప్రజలలో ఆత్మస్థైర్యం నింపుతున్నారని అన్నారు. విశాఖ ప్రజలు తుఫానును ధైర్యంగా ఎదుర్కొన్నారని అన్నారు.
ఆధునిక పరిజ్ఞానంతో తుఫాను నష్టాన్ని భారీగా తగ్గించడం జరిగిందని బాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వం స్పందించిన తీరు బాగుందని చెప్పారు. ప్రస్తుతం విశాఖలో 40శాతానికిపైగా విద్యుత్ సరఫరా అవుతోందని బాలకృష్ణ చెప్పారు. ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సహాయచర్యలు ప్రజలందరికీ అందుతున్నాయని చెప్పారు. ఇందుకోసం పని చేస్తున్న ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.
తుఫాను బాధితులకు సహాయం చేయడం కోంస తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉంటే సినీ పరిశ్రమ వారిని ఆదుకోవడం కోసం ముందుకు రావడం ఎన్టీఆర్ కాలం నుంచి జరుగుతోందని చెప్పారు. ఈసారి కూడా సినీ పరిశ్రమ బాధితులకు సాయం చేయడం కోసం ముందుకు వచ్చిందని, ఇది స్ఫూర్తి కలిగించే విషయమని తెలిపారు.
అనంతరం విశాఖలో హుధుద్ తుఫాను బాధితులను బాలకృష్ణ పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వెలగూడి రామకృష్ణబాబుతో కలిసి పలు కాలనీల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై స్వయంగా పరిశీలించారు. బాలకృష్ణను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.
కాగా, శుక్రవారం హస్పిరా ఫార్మా తుఫాను బాధితుల సహాయార్థం రూ. 60లక్షల చెక్కును అందించింది. ఏపి చేపల రైతు సంఘం రూ. 20లక్షలను సిఎం సహాయ నిధికి అందించింది. కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం రూ. 10లక్షలను బాధితుల సహాయార్థం అందజేసింది.