పాతాళభైరవి కాదు కదా: సిఎం పదవిపై నర్మగర్భంగా బాలకృష్ణ
అనంతపురం: ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారా లేదా అనే విషయంపై తెలుగదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నర్మగర్భంగా స్పందించారు. బుధవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ పదవులను ఆశించి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ముఖ్యమంత్రి పదవిని కాలమే నిర్ణయిస్తుందని బాలయ్య నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే జాబు వస్తుందన్నారని, అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నింటినీ నిదానంగా పరిష్కరించుకుంటూ వెళ్తామని జవాబిచ్చారు. సమస్యలన్నింటినీ అప్పటికి అప్పుడు పరిష్కరించడానికి ఇదేం పాతాళభైరవి కాదు కదా అన్నారు.
కాలం వెంట తాము పరుగెత్తబోమని, కాలమే తమ వెంట పరుగెత్తాలని బాలకృష్ణ అన్నారు. తన జీవితాన్ని అభిమానులను అంకితం చేశానని, ఇది కేవలం నాంది మాత్రమేనన్నారు. ఇకపై పూర్తిస్థాయిలో అభిమానులకు అందుబాటులో ఉంటానన్నారు. అనంతపురం జిల్లా అభిమానుల ఖిల్లా అని జిల్లాకు తన సేవలను పూర్తిగా అందచేసి రుణం తీర్చుకుంటానన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్థవంతమైన నాయకుడని బాలయ్య కొనియాడారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఆయన చెప్పారు. జిల్లాలోని లేపాక్షి భూములు ఈడి ఆధీనంలో ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకునే అంశంపై కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. భూములను అప్పగిస్తే జిల్లా అభివృద్ధికి వినియోగించుకుంటామన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. హిందూపురంలో ఇసుక అక్రమ రవాణాపై మాట్లాడుతూ అక్కడ ఎవరు అక్రమంగా ఇసుక రవాణా చేసినా తన దృష్టికి తీసుకుని రావాలన్నారు.