ఎమ్మెల్సీ సంతోషమే: లోకేష్కు మంత్రి పదవిపై తెలియదన్న బాలకృష్ణ
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అర్హుడని తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యం
అమరావతి: ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అర్హుడని తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఉదయమే అక్కడికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. అంతా కష్టపడి సమష్టిగా కృషి చేయడంతోనే నూతన అసెంబ్లీ భవనం త్వరితగతిన పూర్తయిందని అన్నారు. రాజధాని, అసెంబ్లీ కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఈ సందర్భంగా బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు.
నూతన అసెంబ్లీలో అడుగుపెడుతున్న సందర్భంగా చంద్రబాబుకు ఆయన అభినందనలు తెలిపారు. లోకేష్ మంత్రిగా అవుతున్నారంట కదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మంత్రి పదవి గురించి తనకు తెలియదని అన్నారు బాలకృష్ణ.
లోకేష్ సేవలను గుర్తించి ఎమ్మెల్సీని చేయడం తనకు సంతోషంగా ఉందని బాలకృష్ణ చెప్పారు. లోకేష్కు ఇందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. సభలో ప్రజాసమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ఈ సందర్భంగా బాలకృష్ణ కోరారు. హిందూపురం సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు.
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ.. నూతన అసెంబ్లీతో తెలుగుజాతి సంబరపడిపోతోందని చెప్పారు. రాజధాని, అసెంబ్లీ కోసం భూములు త్యాగం చేసిన రైతన్నలకు పాదాభివందనం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నారా లోకేష్ సామాన్య కార్యకర్త నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారని చెప్పారు. ఉన్నత చదువులు చదివిని విద్యావంతుడని కొనియాడారు.