లేఖ: మంత్రి నారాయణ దూకుడికి బాలకృష్ణ బ్రేక్
అనంతపురం: పన్నుల వసూలు విషయంలో మంత్రి నారాయణ దూకుడికి అనంతపురం జిల్లా హిందూపురంలో శాసనసభ్యుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ కళ్లెం వేశారు. నారాయణకు బాలకృష్ణ రాసిన లేఖతో పన్ను బకాయిల విషయంలో సందిగ్ధత ఏర్పడింది.
హిందూపురం పట్టణంలో పన్ను వసూళ్లులో వడ్డీ మాఫీ, అపరాధరుసుం వసూళ్లలో సడలింపు చేయాలని బాలకృష్ణ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు లేఖ రాశారు. దాంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో అధికారులు పడ్డారు. ఈ నెలాఖరుకు వంద శాతం వసూళ్లు సాధించాలనే పట్టుదలతో ఉన్న మునిసిపల్ అధికారుల లక్ష్యంపై నీళ్లు చల్లినట్టయింది.
కొద్ది రోజులుగా పట్టణంలో పన్ను వసూళ్ల కోసం ప్రత్యేక బృందాల ద్వారా విస్తృతంగా చేపడుతున్నారు. అయితే హిందూపురం పట్టణంలో ఆస్తి పన్ను వసూళ్లలో వడ్డీ, అపరాధ రుసుం సడలించి ఏప్రిల్ 30 వరకు గడువు ఇవ్వాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు రాసిన లేఖ సోమవారం వెలుగు చూసింది.
దీనికి తోడు ఎమ్మెల్యే స్వగృహంలోనే పట్టణ టీడీపీ అధ్యక్షుడు సహా కొంత మంది నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పన్ను వసూళ్లలో ప్రజలకు ఇబ్బందులు పెట్టొదని వెల్లడించారు. హిందూపురం పట్టణంలో కొన్నేళ్లుగా పేరుకుపోయిన పన్ను వసూళ్లపై ఈ నెల 19న మున్సిపల్ శాఖ జేడీ సోమనారాయణ మునిసిపల్ అధికారులను సమీక్ష చేసి అన్నివిభాగాల అధికారులను 14 బృందాలుగా నియమించారు.
ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 31కి వందశాతం పూర్తి చేయాలని, అవసరమైతే జప్తు చేయాలని అలా చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించి వెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన బృందాలు డివిజన్ల వారిగా బకాయిదారులు పన్ను చెల్లించే విధంగా ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరి అయిన కొంతమంది ఈ విషయాన్ని ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో ఇప్పటికే ఈ విషయంపై ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి నారాయణకు లేఖ రాసిన విషయం సోమవారం బయటకు వచ్చింది. పన్నుల వసూళ్లపై టీడీపీలోని కొందరు ఇదే విషయాన్ని మునిసిపల్ అధికారులకు సూచించడంతో వారిని ఇరకాటంలో నెట్టారు. అయితే పన్ను వసూళ్లలో అపరాధరుసుం, వడ్డీ సడలించాలని తమకేమీ ఆదేశాలు రాలేదని మున్సిపల్ అధికార వర్గాలు అంటున్నాయి.