దేశంలో ఎక్కడా ఇలా లేదు!.. ఏపీలో చంద్రబాబు తప్ప: బ్యాంకర్ల ఆగ్రహం
బ్యాంకుల పనితీరు నిర్లక్ష్యపూరితంగా ఉందంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ ఖండించింది.
విజయవాడ: నోట్ల రద్దు.. తదనంతర పరిణామాలపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆరు రాష్ట్రాల సీఎంలతో కూడిన సబ్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసిన సందర్బంలో.. బ్యాంకు అధికారుల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబు వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ-ఐబాక్) ఆయన వ్యాఖ్యలను ఖండించింది. ఐబాక్ కృష్ణా జిల్లా కన్వీనర్ కె.రఘురాం, కేంద్ర బ్యాంకుల అసోసియేషన ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరావు, సూర్యనారాయణతో పాటు పలువురు బ్యాంకు అధికారులు ఇదే విషయమై చర్చించేందుకు మంగళవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు.
20 రోజులైనా: బ్యాంకర్లపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, ఫోన్లో జైట్లీతో 'అసహనం'
సీఎం వ్యాఖ్యలు సమంజసం కాదని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తమపై ఇలాంటి ఆరోపణలకు పూనుకోవడం అర్థం లేని పని అని అసంత్రుప్తి వ్యక్తం చేశారు. నోట్ల రద్దు తర్వాత నగదు డిమాండ్కు, సరఫరాకు మధ్య 75 శాతం తేడా ఉందని.. దీంతో పాటు సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఈ విషయాలను సీఎం అర్థం చేసుకోవాలని సూచించారు.
సెలవులను సైతం ఉపయోగించుకోలేని స్థితిలో ప్రస్తుతం బ్యాంకు అధికారులు ఉన్నారని, ఒకవేళ సెలవు పెట్టినా.. ఫోన్ చేసి పిలిపించి మరీ పనిచేయిస్తున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. కరెన్సీతో తమకు సంబంధం ఉండదన్న విషయాన్ని గ్రహించాలని, తాము కేవలం పంపిణీదారులు మాత్రమేనని, డబ్బును సర్దుబాటు మాత్రమే చేయగలమన్న సంగతి గుర్తించాలని హితవు పలికారు.
ఒకపక్క ఖాతాదారులకు నగదు పంపిణీ కొనసాగిస్తూనే.. మరోవైపు కృష్ణా జిల్లా లాంటి చోట్ల జీరో బ్యాలెన్స్ ఖాతాలను ఓపెన్ చేయిస్తున్నామని తెలిపారు. తగినంత మొత్తంలో ఆర్బీఐ నుంచి నగదు అందుబాటులోకి రావడం లేదని పేర్కొన్నారు. 'దేశంలో ఏ రాష్ట్రంలోను బ్యాంకర్లపై వ్యతిరేకత లేదు ఒక్క ఏపీలోనే బ్యాంకర్లపై విమర్శలు చేయడం బాధాకరం' అని బ్యాంకు అధికారులు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం నగదు కొరత సమస్య వెంటాడుతున్నప్పటికీ.. ఒకటో తేదీన జీతాలకు, పెన్షన్లకు ఇబ్బంది లేకుండా సేవలందిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బ్యాంకర్లను బాగా ఇబ్బంది పెడుతున్నారని ఈ సందర్బంగా కేంద్ర బ్యాంకుల మల్లికార్జునరావు ఆరోపించడం గమనార్హం.