ఉండవల్లి శ్రీదేవికి నందిగం సురేష్ కౌంటర్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మూడురోజులపాటు ఎవరికీ అందుబాటులోకి రాని శ్రీదేవి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రావాలంటేనే భయం వేస్తోందని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వైసీపీ నుంచి పలువురు నాయకులు ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ స్పందించారు. ''ఏంటీ నిన్ను హత్యచేస్తారేమోనని కనిపించకుండా పోయావా? ప్రెస్ మీట్ పెడుతున్నావా? టికెట్ ఇచ్చి గెలిపించుకున్న ఎమ్మెల్యేలను తానే చంపుకునే అలవాటు ముఖ్యమంత్రి జగన్ కు లేదన్నారు. నీలాగ అమ్ముడుపోయేవారి గురించి ఆలోచించే అలవాటు కూడా లేదని'' నందిగం సురేష్ ట్వీట్ చేశారు.

ఉండవల్లి శ్రీదేవి కొన్నాళ్లుగా వైసీపీకి దూరం జరుగుతున్నారు. తాడికొండ నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తను నియమించినప్పటినుంచి నియోజకవర్గంలో వర్గపోరు నడుస్తోంది. అధిష్టానం తాడికొండ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి 2024 ఎన్నికల్లో శ్రీదేవికి టికెట్ ఇవ్వనని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆమె పార్టీపై అసంతృప్తిగా ఉన్నారనే వ్యాఖ్యలు వినపడుతుండేవి. అధిష్టానం చెప్పినదానికి వినకుండా ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినవారిలో నలుగురు ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించారు. ఆ నలుగురిలో ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆమె పేరును ప్రకటించారు. ఉండవల్లి శ్రీదేవి కూడా సజ్జల నుంచి హాని ఉందంటూ ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications