డిమాండ్ల పరిష్కారం కోసం క్షురకుల విధులు బహిష్కరణ:అన్ని ఆలయాల్లో ఇదే పరిస్థితి!
విజయవాడ:కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పనిచేసే క్షురకులు విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. క్షురకుల విధుల బహిష్కరణతో పలు దేవాలయాల్లో కేశఖండన శాలలు మూతపడినట్లు తెలిసింది.
మరోవైపు క్షురకులు అనూహ్యంగా సమ్మె బాట పట్టడంతో తలనీలాల మొక్కులు చెల్లించేందుకు ఆలయాలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో విధులు బహిష్కరించిన క్షురకులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు.
విజయవాడ దుర్గ గుడిలో రెండు వారాల క్రితం పాలకమండలి సభ్యుడు ఒకరు ఓ క్షురకుడి పై దాడి చేసిన సంగతి తెలిసిందే. భక్తుడి వద్ద క్షురకుడు డబ్బు తీసుకున్నారంటూ ఆ పాలకమండలి సభ్యుడు ఒక క్షురకుడిపై దుర్భాషలాడి చేయి చేసుకొన్న నేపథ్యంలో...అప్పుడు క్షురకులు అందరూ ధర్నాకు దిగగా...ఆ సమయంలో పాలకమండలి చైర్మెన్ గౌరంగబాబు...ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న క్షురకులకు కొన్ని హామీలు ఇచ్చారు. అయితే ఆ హామీలు వేటిని నెరవేర్చకపోవడంపై క్షురకులు ఆగ్రహంతో ఉన్నారు.
తమకు కనీస వేతనాలు ఇవ్వాలని క్షురకులు కోరుతున్నా అధికారుల స్పందించకపోవడంతో ఆందోళనకు దిగారు. మరోవైపు క్షురకుల నిరసనకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. క్షురకుల సమస్యలు పరిష్కరించాలంటూ వైసీపీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్ డిమాండ్ చేశారు.అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రముఖ ఆలయాల్లో క్షురకులు ఇలాగే విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొంటున్నట్లు తెలిసింది
ఇదిలా వుండగా కృష్ణాజిల్లాలోని పెనుగ్రంచిప్రోలు లక్ష్మీతిరుపతమ్మ దేవస్థానంలో క్షురకులు ఆందోళనకు దిగారు. దీంతో మొక్కులు చెల్లించేందుకు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చిన భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మొక్కు చెల్లించకుండా తిరిగి వెళ్లలేక హెయిర్ సెలూన్లకు వెళ్లి తమ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారని సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో సెలూన్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయట. అలాగే ద్వారకా తిరుమల, అన్నవరం సత్యదేవుడి క్షేత్రంలో కూడా క్షురకులు ఆందోళనకు దిగారుట.
అరసవెల్లి, సింహాచలం పుణ్యక్షేత్రాల్లో కూడా క్షురకులు ఆందోళన బాటపట్టారు. దీంతో కల్యాణకట్ట ఏకంగా మూతపడింది. శుక్రవారం సందర్భంగా మొక్కులు చెల్లించేందుకు వచ్చిన భక్తులు క్షురకుల మెరుపు సమ్మెతో యాతన పడుతున్నారు. తమ డిమాండ్లను పరిశీలించాలంటూ శ్రీశైల దేవస్థానం కల్యాణకట్టలో పనిచేసే క్షురకులు విధులు బహిష్కరించి ధర్నా చేస్తున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర దేవాలయాల నాయీబ్రహ్మణ సంఘ ఐకాస పిలుపు మేరకు క్షురకులు కల్యాణకట్ట వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లపై ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలని, అంతవరకు ఆందోళన విరమించేది లేదని క్షురకులు తేల్చిచెబుతున్నారు.
మరోవైపు క్షురకుల ఆందోళనపై డిప్యూటీ సిఎం, మంత్రి కెఈ కృష్ణమూర్తి స్పందించారు. దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని కేఈ కృష్ణమూర్ చెప్పారు. ఈ నెల 18న అధికారులు, క్షురకుల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ ఆందోళనలతో దేవాలయాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలిగించొద్దని, వెంటనే క్షురకులు ఆందోళన విరమించాలని డిప్యూటీ సీఎం కేఈ కోరారు.