ప్రతిఘటిస్తోన్న బీసీలు.. ముద్రగడ స్పందిస్తారా!: బాబు చూపించే పరిష్కారమేంటి?
కిర్లంపూడి: ఓవైపు ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలంటూ.. కాపు నేత ముద్రగడ పాదయాత్రకు సిద్దమవుతుంటే.. కేవలం ఎన్నిక వాగ్దానాన్ని సాకుగా చూపుతూ కాపులను బీసీల్లో చేర్చడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు బీసీ నేతలు.
శనివారం నాడు కిర్లంపూడిలోని జిల్లా బీసీ సంఘం నాయకులతో సమావేశమైన రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-340లో పేర్కొన్న ప్రకారం సాంఘీకంగా, విద్యాపరంగా వెనుకబడిన వారిని మాత్రమే బీసీలుగా గుర్తించాలన్న ఆయన.. కేవలం ఎన్నికల్లో హామి ఇచ్చామన్న కారణంతో.. కాపులను బీసీల్లో చేర్చాల్సిన అవసరముందని సూటిగా ప్రశ్నించారు.
ఇప్పటికే అభివృద్ధి చెందిన వారికి విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీ కోటా కింద అవకాశాలు కల్పిస్తే.. న్యాయస్థానాల తీర్పును ధిక్కరించినట్లే అవుతుందని తెలిపారు. కిర్లంపూడిలో సమావేశం అనంతరం రాజమహేంద్రవరంలోని అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు శంకరరావు.
కాపులను బీసీల్లో చేర్చడం ద్వారా భవిష్యత్తులో బీసీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతుందని ఈ సందర్బంగా శంకరరావు అభిప్రాయపడ్డారు. క్షేత్ర స్థాయిలో బీసీ సంఘాలను బలోపేతం చేసేందుకు కొత్త తరానికి కూడా అవకాశం కల్పించాలనే యోచనలో ఉన్నారు బీసీ పెద్దలు.
బీసీ బలోపేతం..; ముద్రగడ పోరాటానికి బ్రేక్ వేస్తారా!
పరిస్థితి చూస్తోంటే.. రాబోయే రోజుల్లో ఏపీలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ దఫా ఉద్యమాన్ని ఉధృతం చేసి.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన ముద్రగడ.. మరోమారు తన పాదయాత్ర ద్వారా కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ను గట్టిగా వినిపించనున్నారు.
ఇదిలా ఉంటే, ముందునుంచి కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వస్తోన్న బీసీ సంఘాలు.. ఇప్పుడు తమ సంఘాలను మరింత పటిష్టపరిచే పనిలో పడ్డాయి. అంటే, భవిష్యత్తులో ప్రభుత్వం గనుక కాపులను బీసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకుంటే.. పెద్ద ఎత్తున ప్రతిఘటించడానికి ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నాయి బీసీ సంఘాలు.
దీంతో.. ఓవైపు కాపు ఉద్యమం.. మరోవైపు బీసీల ప్రతిఘటన నడుమ.. చంద్రబాబు ప్రభుత్వం ఇరుకున పడడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది. ఇక ఇన్ని అవరోధాలను అధిగమించి ఈ సమస్యకు సీఎం చంద్రబాబు ఎలాంటి పరిష్కార మార్గం చూపిస్తారనేది వేచి చూడాలి.