యాజమాన్యానిదీ తప్పు: బియాస్ ట్రాజెడీపై నాయని
హైదరాబాద్: బియాస్ నది విషాద ఘటనలో కాలేజీ యాజమాన్యానిది కూడా తప్పు ఉందని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి అన్నారు. విద్యార్థులతో సీనియర్ లెక్చరర్ను పంపించలేదని, టూరిస్టు గైడ్ లేకుండానే బియాస్ నది వద్దకు వెళ్లారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ఘటనపై, చేపట్టిన గాలింపు చర్యలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు నివేదిక ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రమాదానికి కారణాలను కూడా ఆయన వివరించారు.

ఏ విధమైన హెచ్చరికలు చేయకుండా డ్యాం అధికారులు నీళ్లు వదిలారని ఆయన తప్పు పట్టారు. అది ఓ తప్పు అయితే సీనియర్ లెక్చెరర్ విద్యార్థుల వెంట వెళ్లకపోవడంతో పాటు స్థానిక టూరిస్టు గైడ్ను ఏర్పాటు చేయకపోవడం మరో తప్పిదమని ఆయన అన్నారు
తాను హోం మంత్రి కాగానే ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని నాయని అన్నారు. విద్యార్థుల ఫీజులు తిరిగి ఇవ్వడానికి కళాశాల యాజమాన్యం అంగీకరించిందని ఆయన చెప్పారు. బ్యాంక్ రుణాలు ఉంటే కళాశాల యాజమాన్యమే చెల్లిస్తుందని ఆయన అన్నారు. మృతుల తమ్ముళ్లకు, చెల్లెళ్లకు కళాశాల సీట్లు ఇస్తుందని ఆయన చెప్పారు.
ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కూడా స్పందించిందని, డ్యాం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇంత పెద్ద దుర్ఘటన జరిగిందని ఆయన అన్నారు. హిమాచల్ ప్రభుత్వం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే నలుగురు ఇంజనీర్లను సస్పెండ్ చేసిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications