ఆడపిల్లలు పుట్టారని వేధింపులు: పిల్లలను చంపి, తల్లి సూసైడ్
హిందూపురం: భర్త వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి కూడ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా నాయనపల్లిలో మంగళవారం నాడు చోటు చేసుకొంది. అయితే భర్తే భార్య , పిల్లలను చంపేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం తుంగోడుకు చెందిన రత్నమ్మ, శివాచారి దంపతుల కుమారై కల్పనకు లేపాక్షి మండలంలోని నాయనపల్లికి చెందిన వీరభద్రాచారితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మేఘన , యశస్విని సంతానం. అయితే ఇధ్దరు ఆడపిల్లలే పుట్టారని భర్త వీరభద్రాచారి తరచూ భార్యతో గొడవ పెట్టుకొనేవాడని కల్పన తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు.
దంపతులిద్దరూ హిందూపురంలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం భర్త విధులకు వెళ్లిన సమయంలో కల్పన (25) తన ఇద్దరు కుమార్తెలకు ఇంట్లోనే ఉరిపోసి తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సర్పంచ్ సదాశివరెడ్డి ఇనుప సమ్మెట అవసరమై కల్పన ఇంటి తలుపు తట్టగా ఎవరూ స్పందించ లేదు. అనుమానం వచ్చి కిటికీలో చూడగా పిల్లలతో పాటు తల్లి ఉరేసుకుని ఉండటాన్ని చూసి వీరభద్రాచారికి విషయం తెలిపాడు. ఇంటికి చేరుకున్న ఆయన తలుపులు తీసి పోలీసులకు సమాచారమిచ్చాడు.
భర్త మృతి, మరో యువకుడితో లవ్ ఎఫైర్, ట్విస్టిచ్చిన లవర్
ఆడపిల్లలు పుట్టారనే విషయమై దంపతులు మధ్య తరచుగా గొడవ జరుగుతుండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మూడురోజుల క్రితం కూడా ఇదే విషయమై భార్యాభర్తలు ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా కల్పన ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఇంట్లోనే పిల్లలతో ఉంటోంది.
అల్లుడే ఈ ఘోరానికి పాల్పడి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.