చంద్రబాబుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు: ఏపీలో జగన్ ఎటువైపో తేలిపోయిందా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీతో జత కలిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ వేర్వేరుగా పోటీ చేసినా ఎన్నికల తర్వాత లేదా జాతీయ రాజకీయాల్లో వారు కలిసి పోరాడుతున్నారు.
జగన్ సొంత ఇలాకాలో పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తారా, ఇదీ లెక్క?: టీడీపీ బలం పెరుగుతోందా?
లోపాయికారి ఒప్పందం
ఇక, వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటో ఒంటరిగా ముందుకు సాగుతోంది. అయితే వైసీపీకి బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉందనేది తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణ. ఇందుకు ఆ పార్టీ నేతలు పలు కారణాలు చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా లేవనెత్తక పోవడం, జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్న వారికి క్రమంగా ఊరట లభించడం వంటి వాటిని చూపిస్తున్నారు.
అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఏపీలోని రాజకీయ పరిస్థితులు, తాజాగా, ఉత్తరాంధ్రలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఏపీలోని కీలక పార్టీలైన టీడీపీ, జనసేన, వైసీపీ ఎటువైపో తేలిపోయాయని చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో చేరింది. జనసేన.. ఏపీలో లెఫ్ట్ పార్టీతో ఉన్నందున.. జాతీయస్థాయిలోను అలాగే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు అమిత్ షా మాట్లాడుతూ... వచ్చే లోకసభ ఎన్నికల్లో తామే గెలుస్తామని, ఆ తర్వాత చంద్రబాబు మళ్లీ తమ వైపుకు వస్తారని, కానీ తమ డోర్లు మూసివేశామని చెప్పారు.
జగన్ వచ్చినందునే చంద్రబాబుకు డోర్లు క్లోజ్?
ఇప్పటికే బీజేపీ, వైసీపీ కలిసిపోవాలని నిర్ణయించుకోవచ్చునని, అందుకే అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీకి 2014లో వచ్చినట్లుగా పూర్తి సీట్లు వచ్చే పరిస్థితులు లేవు. పలు ప్రీపోల్ సర్వేల ప్రకారం ఇప్పుడున్న ఎన్డీయే కూటమి.. మేజిక్ ఫిగర్ 272కు సమీపంలో నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం. దక్షిణాది నుంచి టీఆర్ఎస్, వైసీపీ, అన్నాడీఎంకే పార్టీలు ఎన్నికల తర్వాత ఎన్డీయేకు మద్దతు పలుకుతాయనే ప్రచారం సాగుతోంది. ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య అంతర్గత ఒప్పందం కుదిరినందునే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవారికి మద్దతిస్తామని జగన్ చెబుతున్నప్పటికీ.. తిరిగి ఎన్డీయే వచ్చే అవకాశాలు ఉన్నందున, హోదా మినహా ఇతర హామీల కోసమైనా జగన్ ఎన్డీయేలో చేరే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. ఒకేవేళ కేంద్రంలో ఎన్డీయే, యూపీఏకు సరైన మెజార్టీ రాకుండా.. ఇతర ఫ్రంట్ల ఏర్పడితే కేసీఆర్ దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు.