రాజీనామా షాకింగ్!: జగన్ ఢిల్లీ పర్యటన మర్మం ఏమిటి? ఎంపీల అసహనం
ఏపీకి ప్రత్యేక హోదాపై తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ గతంలో వైసిపి అధినేత వైయస్ జగన్ చేసిన ప్రకటన ఆ పార్టీ ఎంపీలలో అసంతృప్తికి కారణమవుతోందనే ప్రచారం సాగుతోంది.
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదాపై తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ గతంలో వైసిపి అధినేత వైయస్ జగన్ చేసిన ప్రకటన ఆ పార్టీ ఎంపీలలో అసంతృప్తికి కారణమవుతోందనే ప్రచారం సాగుతోంది.
వైసీపీలో గెలిచి, టిడిపిలోకి వెళ్లిన పలువురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు జగన్ బుధవారం ఢిల్లీ పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

రాజీనామాల వల్ల లాభం ఏమిటి
ఈ నేపథ్యంలో జగన్ తీరుపై ఆ పార్టీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజలు ఇప్పుడు ప్రధాన అంశంగా భావించడం లేదని, అలాగే, కేంద్రం కూడా ప్యాకేజీకి చట్టబద్దత కల్పిస్తోందని, అలాంటప్పుడు రాజీనామాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎంపీలు అభిప్రాయపడుతున్నారు.

తనంత తానుగా ప్రకటన.. రాజీనామాపై..
రాజీనామా అంశం తమ పార్టీ అధినేత జగన్ తమతో చర్చించలేదని,
ఆయనంతట ఆయనే ప్రకటన చేశారని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. జగన్ బుధవారం ఢిల్లీ వస్తున్నారని, మూడు రోజులు ఇక్కడే ఉంటారని, బహుశా రాజీనామాల అంశంపై చర్చించవచ్చునని అంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశానికి ప్రస్తుతం పెద్దగా ప్రాధాన్యత లభించటం లేదని, ప్రజలు కూడా దీనిని ప్రధాన అంశంగా భావించటం లేదని, కానీ దీనిని వారు మర్చిపోలేదని, హోదాతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని వారు నమ్ముతున్నారని, కాబట్టి, ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని వైసిపి ఎంపీలు కోరుకుంటున్నారట.

ఎన్నికల్లో..
ఎన్నికల అంశాల్లో దీన్ని కూడా ఒకటిగా చేసుకోవాలని, అంతే తప్ప రాజీనామాలు చేయటం సరైన వ్యూహం కాబోదని వైసిపి ఎంపీలు చెవులు కొరుక్కుంటున్నారని తెలుస్తోంది.

రాజీనామాలపై జగన్ వాయిదా!
వాస్తవానికి ప్రత్యేక హోదా డిమాండ్ను సాధించేందుకు శీతాకాల సమావేశాల్లోనే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ బహిరంగంగా ప్రకటించారు. అవి ముగిసిపోవటంతో బడ్జెట్ సమావేశాల్లో తమ ఎంపీలు రాజీనామా చేస్తారని మరోసారి ప్రకటించారు. ఈనెల 12వ తేదీతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా ముగియనున్నాయి.

బీజేపీలోకి నో!
ఇదిలా ఉండగా, దక్షిణ భారతంలోని రాష్ట్రాలపై బీజేపీ దృష్టి సారించిన విషయం తెలిసిందే. స్థానికంగా పేరున్న, సామాజికవర్గంపరంగా బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఏపీలో సైతం వైసిపికి చెందిన కీలక నాయకుడిపై బీజేపీ కన్నేసిందని, ఆయన కూడా మోడీ పాలన పట్ల, బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పటి వరకూ తమ పార్టీలో ఎవరికీ ఎలాంటి ఆఫర్ రాలేదని, బీజేపీ నుంచి తమను ఎవ్వరూ సంప్రదించలేదని, తాము కూడా వెళ్లమని ఎంపీలు చెబుతున్నారట.












Click it and Unblock the Notifications