ఐపీఎల్ ను తలదన్నే బెట్టింగ్ లు..! కాయ్ రాజా కాయ్ అంటున్న ఏపి రాజకీయం..!!
అమరావతి/హైదరాబాద్ : తాడేపల్లిగూడెం: ఐపీఎల్ ను తలదన్నే బెట్టింగులు ఇప్పుడు ఏపి రాజకీయాల్లో చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలపై ఇప్పుడే పందెంగాళ్లు కాళ్లు దువ్వుతున్నారు. నియోజకవర్గాల వారీగా అంచనాలు వేసుకుంటున్నారు. సొంత సర్వేలు నిర్వహించుకుంటున్నారు. జననాడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పందెం కాయడంలో కమీషన్దారులు ఇప్పుడు కీలకంగా మారారు. నియోజకవర్గ కేంద్రాలు, పల్లెల్లోని ప్రధాన కూడళ్లలో సంచరిస్తున్నారు. జననాడి ఎలా ఉందనే దానిపై దృష్టి సారించారు. ముఖ్యంగా పోటీలో కీలకంగా ఉన్న నియోజకవర్గాలనే ఎన్నుకుంటున్నారు. ముఖ్య నాయకులు పోటీ చేసే చోట పందెం కాసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్న నియో జకవర్గాలను ఎన్నుకుంటున్నారు పందెం రాయుళ్లు.
జిల్లాలోని ఆచంట, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలపై పందెం రాయుళ్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆచంటలో మంత్రి పితాని సత్యనారాయణ, చెరుకువాడ రంగ రాజులు తలపడుతున్నారు. భీమవరంలో పవన్కల్యాణ్ పోటీలో ఉన్నారు. తాడేపల్లిగూడెంలో తెలుగు దేశం తరపున ఈలినాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున కొట్టు సత్యనారాయణ, జనసేనలో బొలిశెట్టి శ్రీని వాస్లు తలపడుతున్నారు. ముగ్గురు అభ్యర్థులు బలమైన వారు కావడంతో ఈ నియోజకవర్గంలోనూ పందెం రాయుళ్లు పందేలకు దిగుతున్నారు. జననాడి తెలుసుకోవడానికి పర్యటనలు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి కమీషన్దారులు ఇక్కడకు వచ్చి ప్రజల నాడిని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కడంతో పాటు పందెం రాయుళ్లతో నియోజక వర్గాలు కిటకిటలాడుతున్నట్టు తెలుస్తోంది.