కారులో రూ.2.5 కోట్లు, బిజెపి కార్యకర్తను కొట్టిన విహెచ్
హైదరాబాద్: నల్గొండ జిల్లా సూర్యాపేట వద్ద దగ్ధమైన ఇన్నోవా కారులో రూ.2.5 కోట్లు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ బుధవారం తెలిపారు. కారు దగ్ధం ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అలాగే మాజీ డిజిపి దినేష్ రెడ్డి వ్యవహారంపై కూడా విచారణకు ఆదేశించనట్లు చెప్పారు. సాయంత్రం ఆరుగంటల వరకు క్యూలో ఉన్న వారందరు ఓటు హక్కును వినియోగించుకోవచ్చుని తెలిపారు.
ఇన్నోవాలా కారు ఘటన కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. కారు నెంబర్ ఎపి 09 బిటి 8289 అని చెప్పారు. కారు ఇంజిన్లో రెండున్నర కోట్ల రూపాయలు లభ్యమయ్యాయని, డబ్బు కాలిపోయిందన్నారు. ఇన్నోవా కారు పోటాన్ ఎనర్జీ సిస్టమ్స్ కంపెనీపై రిజిస్టర్ అయి ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ కారు పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టిక్కర్ ఉన్న విషయం తెలిసిందే.
విక్రమ్ పైన కేసు
టిడిపి, బిజెపి కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్పై పోలీసు కేసు నమోదు అయింది. పోలింగ్ నేపథ్యంలో విక్రమ్ గౌడ్ గౌలిగూడకు వచ్చారు. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపై ఆయన దౌర్జన్యానికి దిగారు. ఈ వ్యవహారంపై టిడిపి కార్యకర్తలు అఫ్జల్ గంజ్ పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో విక్రమ్ గౌడ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
చేయి చేసుకున్న విహెచ్
కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు, అంబర్ పేట అసెంబ్లీ అభ్యర్థి వి హనుమంత రావు బిజెపి కార్యకర్త పైన చేయి చేసుకున్నారు. క్షీరసాగర్ అనే బిజెపి కార్యకర్త పైన చేయి చేసుకున్నారు.