గుంటూరులో భారీ ఏర్పాట్లు: జగన్ దీక్షాస్థలికి భూమి పూజ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26వ తేదీ నుంచి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు కూర్చునే చోటు వద్ద ఆదివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భూమి పూజ చేశారు. జగన్ దీక్ష కోసం ఏర్పాట్లు చేయడంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మునిగిపోయారు.
గుంటూరులోని ఎసి కళాశాల ఎదుట గల ఉల్ఫ్ హాల్ గ్రౌండ్ను దీక్షాస్థలిగా నిర్ణయించారు. కార్యకర్తల కోసం బారికేడ్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై నాయకులు చర్చలు జరిపారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు బొత్స సత్యనారయాణ, కొలుసు పార్థసారథి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, శాసనసభ్యులు కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ అధికార ప్రతినిధి అంబటరా రాంబాబు తదితరులు దీక్షా స్థలిని పరిశీలించారు.

వైయస్ జగన్ దీక్షను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. అమరావతి రోడ్డులోని బత్తిని కళ్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గం ఇంచార్జీలు, పార్టీ ఎంపిటీసి సభ్యులు జెడ్పీటిసి సభ్యులు, కౌన్సిలర్లు, అనుబంధ విభాగాల నేతలు హాజరయ్యారు.
కాగా, సోమవారంనాడు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా, తదితరులు జగన్ దీక్షా స్థలిని పరిశీలించారు. జగన్ దీక్షను పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications