నా తండ్రి ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తి కాదు, అమ్మాలాగే నేను: అఖిలప్రియ
హైదరాబాద్: తన తండ్రి, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తి కాదని ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. ఓ న్యూస్ ఛానెల్తో ఆమె మాట్లాడారు. భూమా కుటుంబం ప్యాకేజీలకు లేక పదవులకు అమ్ముడుపోతే 20 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండేది కాదని తెలిపారు.
20 ఏళ్లు నియోజకవర్గంలో విజయం సాధించినప్పటికీ చేయాల్సింది ఎంతో ఉందని, ప్రతిపక్షంలో ఉన్నప్పటి కంటే, అధికారపక్షంలో ఉండగా చేసే పనుల సంఖ్య పెరుగుతుందని ఆమె చెప్పారు. పార్టీ మారడం అన్నది తన తండ్రి, తాను కలిసి తీసుకున్న నిర్ణయమని ఆమె తెలిపారు. తమను అభిమానించే కార్యకర్తలు, ప్రజలు కూడా తమ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు.

పార్టీ మారుతున్న సంగతి కనీసం తన మామ ఎస్వీ మోహన్ రెడ్డికి కూడా చెప్పలేదని ఆమె అన్నారు. తప్పు చేశామని భావిస్తే తాము ముందుకు అడుగు వేయమని ఆమె పేర్కొన్నారు. తమది ఉమ్మడి కుటుంబం అని, వారసత్వం అందరికీ చెందుతుందని ఆమె తెలిపారు.
తన తండ్రికి మంత్రి ఇస్తారనే ఊహాగానాలపై స్పందిస్తూ.. తాము ఏ పదవి అడగలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార తెలుగుదేశం పార్టీలో చేరామని తెలిపారు. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన తండ్రి భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తే అందులో ఆశ్చర్యం ఏమి ఉండదని అన్నారు.
తనకు ట్రావెలింగ్ ఇష్టమని చెప్పిన ఆమె, తన తమ్ముడు, చెల్లికి రాజకీయాలంటే ఆసక్తి ఉందని తెలిపారు. తన తల్లి తర్వాత తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన తల్లిని ఆదరించినట్టుగానే ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు తననూ ఆదరిస్తున్నారని ఆమె చెప్పారు. తన తల్లిలాగే ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్న తపనతో తాను రాజకీయాల్లోకి వచ్చానని భూమా అఖిలప్రియ తెలిపారు.












Click it and Unblock the Notifications