బాబు నిర్ణయంతో అఖిల షాక్?: మాట మాత్రమైనా చెప్పకుండానే..
వైసీపీ సంగతేమో గానీ ఈ పరిస్థితి అందరి కన్నా ఎక్కువగా మంత్రి అఖిలప్రియనే ఇబ్బంది పెడుతోందన్న వాదన వినిపిస్తోంది.
కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో అంతు పట్టడం లేదు. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైపోవడం నియోజకవర్గంలో ఆ పార్టీ బలాన్ని పెంచేదిగా మారింది. అదే సమయంలో నిన్న మొన్నటిదాకా వైసీపీతో టచ్లో ఉన్నట్లు కనిపించిన ఆయన.. ఇప్పుడిలాంటి నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి ఒకింత షాక్ అనే చెప్పాలి.
వైసీపీ సంగతేమో గానీ ఈ పరిస్థితి అందరి కన్నా ఎక్కువగా మంత్రి అఖిలప్రియనే ఇబ్బంది పెడుతోందన్న వాదన వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టికెట్ను ప్రతాప్ రెడ్డికి చంద్రబాబు ఆఫర్ చేయడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ అఖిలప్రియ ప్రత్యర్థి వర్గం ఇప్పుడీ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది.
నంద్యాల ఉపఎన్నికలో అధినేత చంద్రబాబు తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తిలో ఉన్న అఖిలప్రియకు ఇప్పుడీ విషయం ఏమాత్రం మింగుడుపడటం లేదని ప్రచారం సాగుతోంది. ప్రతాప్ రెడ్డి చేరిక విషయం గురించి తనకు మాట మాత్రమైన సమాచారం ఇవ్వకపోవడం అఖిలప్రియను బాధించిందని చెబుతున్నారు.
బుధవారం నాడు నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పాల్గొన్న అఖిలప్రియ.. ప్రతాప్ రెడ్డి టీడీపీ చేరిక గురించి తెలియగానే ముఖ్య అనుచరులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డలో తొలి నుంచి భూమా వర్గానికి వ్యతిరేకంగా ఉన్న గంగుల ప్రతాప్ రెడ్డి వర్గాన్ని పార్టీలో చేర్చుకోవడం అఖిలప్రియకు మింగుడుపడటం లేదట. మున్ముందు వీరంతా కలిసి తన స్థానానికి ఎక్కడ చెక్ పెడుతారోనన్న ఆందోళనలో ఆమె ఉన్నట్లు ప్రత్యర్థి వర్గం చెబుతోంది.